High Court |
విధాత, హైకోర్టు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ చార్జీషీట్లో అవాస్తవాలను పేర్కొందని, తన వాంగ్మూలాన్ని మార్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్కు మెయిన్ నంబర్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
అభ్యంతరాలను పక్కకు పెట్టాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఫైలింగ్ నంబర్ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వీర్రాజు వాదనలు వినిపించారు. ‘2023, ఏప్రిల్ 29న సీఆర్పీసీ 161 కింద అజేయ కల్లం వాంగ్మూలాన్ని సీబీఐ విచారణాధికారి వికాస్కుమార్ వాదనలు రికార్డు చేసుకోగా, చార్జీషీట్లో మాత్రం ముఖేశ్ శర్మ అనే అధికారి సంతకం చేశారు.
ఈ ముఖేశ్ శర్మ ఎవరో పిటిషనర్కు తెలియదు. విచారణాధికారి వికాస్కుమార్ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించారు. ఈ కారణంగానే ఆయనను సుప్రీంకోర్టు మార్చింది. ఓ ఐఏఎస్ అధికారి నుంచి చట్టపరంగా వాంగ్మూలం తీసుకునే విధానం ఏంటో కూడా ఆయనకు తెలియదు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిటిషన్ నంబర్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించాలి’ అని విజ్ఞప్తి చేశారు. వాదనల తర్వాత.. రిజిస్ట్రీ అభ్యంతరాలను పక్కకు పెట్టి, నంబర్ కేటాయించాలని న్యాయమూర్తి రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.