Telangana Secretariat
- ఇప్పటికే దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
- అమరుల త్యాగాలకు ప్రతిరూపం.. అమరజ్యోతి
- రూపు రేఖలు మారిపోనున్న ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు
విధాత: 2014 ఎన్నికల్లో గుజరాత్ అభివృద్ధి నమూనా పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. గత తొమ్మిదేళ్లుగా ఈ నమూనా అంటే ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదు. పైగా ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేట్ పరం చేయడం, దేశ సంపదనంతా మోడీ తన ఇద్దరు మిత్రులు అంబానీ-అదానీలకే కట్ట బెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు.
దీంతో కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టారని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోతే ఆ రాష్ట్రం మనుగడ సాగించలేదని, అంధకారమౌతుందని కొందరు ఎద్దేవా చేశారు. అలా వెక్కించినవాళ్లే నివ్వెరపోయేలా. ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రంలో అనేక అద్భుత నిర్మాణాలు జరుగుతున్నాయి. సుదీర్ఘ కాలం పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదేళ్ల కాలంలో అనేక రంగాల్లో దేశంలోని అనేక రాష్ట్రాల కంటే ముందున్నది.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సబ్బండ వర్ణాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాజ్యాంగ నిర్మాత ముందుచూపుతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని సీఎం అనేక సందర్భాల్లో చెప్పారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దార్శనికత తోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 పొందు పరచడం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందుకే తెలంగాణ ప్రభు ఆయన పేరును నూతన సచివాలయానికి పెట్టి గౌరవించుకున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన నూతన సచివాలయం ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభానికి సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ప్రధాన పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుతున్నారు. నూతన సచివాలయానికి సంబంధించిన విశేషాలను ఆ మద్య ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని ఓ విడుదల చేశారు. కొత్త సచివాలయ భవనం, భవనంలోని ఛాంబర్లు, సమావేవ మందిరాలు, ప్రవేశద్వారాలు, పచ్చికబయళ్లు, ఫౌంటెయిన్లు, భవనం చుట్టూ నలువైపులా విశాలమైన రమదారులు, కాంప్లెక్స్, గుడి, చర్చ్, మసీదులు తదితరాల నమూనాను ఇందులో స్పష్టగా చూపారు.
ఆ నమూనాలు ఇప్పుడు నిర్మాణమై కనిపిస్తున్నాయి. ఆ వీడియోలో చూసినవన్నీఇప్పుడు సెక్రటేరియట్ (Telangana Secretariat) ముందుగా వెళ్తున్నవారికి కళ్లముందు ఆవిష్కృతమవుతున్నది. ఔరా అనేలా ఈ అద్భుత నిర్మాణం పూర్తయ్యింది. దీనితోపాటు అమరవీరుల జ్యోతి, ఇప్పటికే ఆవిష్కృతమైన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంతో ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోనున్నాయి.