Mokila |
విధాత, హైదరాబాద్: మోకిలలో హెచ్ఎండీఏ లేఅవుట్ లో ప్లాట్ల కొనుగోలుకు రెండవ రోజు గురువారం అదే జోరు కొనసాగింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల ప్రాంతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 300 గజాల చొప్పున 1,321 ఫ్లాట్లతో మోకిలలో రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందించింది.
మోకిల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హెచ్ఎండిఏ లే అవుట్ లో ప్లాటు కొనుగోలు కోసం ఔత్సాహకులు ఈ – వేలంలో పాల్గొని పోటీపడి మరి ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 30 ప్లాట్లను వేలం నిర్వహించగా, అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. గజం ధర అత్యధికంగా రూ.72 వేలు పలుకగా, కనిష్టంగా గజం ధర రూ.56 వేల వరకు వచ్చింది.
మధ్యాహ్నం 30 ప్లాట్ లకు వేలం జరగగా అన్నీ అమ్ముడుపోయాయి. మధ్యాహ్నం నుంచి జరిగిన వేలంలో గజం ధర అత్యధికంగా రూ.75వేలు పలుకగా, కనిష్టంగా గజం ధర రూ.56 వేల వరకు వచ్చింది. మొత్తంగా రెండవ రోజు గురువారం మోకిలలో 60 ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.131.72 కోట్ల రెవెన్యూ వచ్చింది.
శుక్రవారం మరో 60 ప్లాట్లను ఈవేలం ద్వారా హెచ్ఎండీఏ విక్రయించనుంది. తిరిగి సోమవారం, మంగళవారంలో రోజుకు 60 ప్లాట్ల చొప్పున మోకిల ప్లాట్లను వేలం ప్రక్రియలో అమ్మకానికి ఉన్నాయి.