విధాత: ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. టీఆర్ఎస్ చెబుతున్నట్లు ఫాం హౌజ్లో డబ్బు దొరికితే అదంతా ఎక్కడికి వెళ్లినట్లు ? అని ప్రశ్నించారు. ఫాం హౌజ్ వద్దకు వెళ్లినవారిలో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నారు.
ఇలాంటి ఘటనల్లో ఎలాంటి కేసులు పెట్టాలనే విషయం వారికి తెలియదా? పక్కా ఆధారాలతో నిందితులను కోర్టులో హాజరుపర్చాల్సిన బాధ్యత ఉన్నది. రిమాండ్కైనా పంపించలేని బలహీనమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇదంతా చూస్తుంటే పోలీసులు వెసులుబాటు కల్పించినట్లుగా స్పష్టమౌతున్నది. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై చేశారనడానికి ఇదే నిదర్శనం అన్నారు. ప్రజలను పక్కదోవ పట్టించడానికి టీఆర్ఎస్, బీజేపీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేతలపై కేంద్రంలోని బీజేపీ సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తున్నది. ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీతో విచారణ చేయించవచ్చు కదా? అని నిలదీశారు.