Site icon vidhaatha

Vivek Venkataswamy | BJPకి షాక్‌.. కాంగ్రెస్‌ గూటికి వివేక్‌ వెంకటస్వామి?

Vivek Venkataswamy |

విధాత: వివిధ రాజకీయ, వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్‌ పార్టీని వీడిన నేతలు తిరిగి సొంతగూటికి రావాలని టీపీసీసీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే. దీనికితోడు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి వీడి బీజేపీలో చేరిన నేతలకు ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు పునరాలోచనలో పడేశాయా?

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులను బీజేపీలోకి తీసుకుని రావడానికి ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని బృందం చేసిన ప్రయత్నాలు విఫలమవడం, వాళ్లే తనను కౌన్సిలింగ్‌ చేశారని నిన్న ఈటల ప్రకటించడం తో ఇక బీజేపీలో తమ రాజకీయ మనుగడ కష్టమే అని కొందరు భావిస్తున్నారా? వంటి ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తున్నది.

గడ్డం వెంకటస్వామి తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. ఆ పార్టీ అధిష్ఠానం ఆయనకు అనేక పదవులతో పాటు కీలకమైన సీడబ్ల్యూసీలోనూ స్థానం కల్పించింది. ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీలుగా కూడా ఆయనకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇచ్చారు. అందుకే ఆయన పార్టీ మారలేదు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనూ ఆయన పార్టీలోనే ఉండి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్‌తో విభేదించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అధినేత్రికి వివరించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కూడా కాంగ్రెస్‌ ను వీడవద్దని వివేక్‌ కు సూచించారు.

అయితే రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ను వీడి నాడు టీఆర్‌ఎస్‌లో చేరిన వెంకటస్వామి తనయుడు వివేక్‌ వెంకటస్వామికి కి కేసీఆర్‌ వైఖరి నచ్చక తిరిగి సొంతగూటికి చేరారు. కానీ కొంతకాలానికే బీజేపీ కండువా కప్పుకున్నారు. కానీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి బీజేపీలోకి చేరిన నేతలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదు.

ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహార శైలికి నచ్చక కొత్త వారు ఎవరూ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. కొన్నిరోజులుగా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. నిన్న బీజేపీలో చేరికలపై ఈటల చేసిన వ్యాఖ్యలు చూస్తే.. కొత్త వారు ఎవరూ సుముఖంగా లేకపోగా.. ఉన్న నేతలు కూడా ఎవరి దారి వారు చూసుకోవాలనుకుంటున్న తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే వివేక్‌ వెంకటస్వామి కూడా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు బాటలోనే నడువాలని భావిస్తున్నారట. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో చర్చలు జరిపినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. జూన్‌ 2న గానీ మరేదైనా సభలో గానీ జూపల్లి, పొంగులేటిలతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం.

Eatela Rajender | పొంగులేటి, జూపల్లిలు బీజేపికి రారు: ఈటల

Exit mobile version