విధాత: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం హైదరాబాద్కు వచ్చారు. ఇవాళ గాంధీ భవన్లో హాథ్ సే హాథ్ జోడో అభియాన్పై జరగనున్న పీసీసీ ఎస్టీ సెల్ కార్యవర్గం, కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గం, పీసీసీ ఉపాధ్యక్షుల సమావేశాల్లో ఠాక్రే పాల్గొంటారు. హథ్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని ఇప్పటికే ఆయన రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. పీసీసీ అధ్యక్షుడు 50 నియోజకవర్గాలు తగ్గకుండా, మిగిలిన సీనియర్లు 20 నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టాలన్నారు.
రేవంత్ చేపట్టిన హథ్ సే హాథ్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతుండగా కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి నిన్న వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడుతుందన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో కేసీఆర్ కలవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై కాంగ్రెస్ అధిష్టానంతో పాటు రాష్ట్ర నేతలు ఆయన వ్యాఖ్యలను ఖండించారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎంపీ కోమటిరెడ్డి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధిష్టానికికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్లోనే ఉంటూ.. పార్టీకి నష్టం చేకూర్చేలా వెంకట్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వ్యవహారశైలిపై రాష్ట్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నది.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం కూడా వెంకట్రెడ్డినే అని అక్కడ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనపై వేటు వేస్తేనే గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట పడుతుందని నేతలు అభిప్రాయ పడుతున్నారు. సమావేశం కోమటిరెడ్డి ఇచ్చే వివరణ, అనంతరం ఏఐసీసీకి ఠాక్రే నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రేను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం కలిసి నిన్నటి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వనున్నారు. వెంకట్రెడ్డి వివరణ తర్వాత ఏఐసీసీకి ఠాక్రే నివేదిక ఇవ్వనున్నారు.