- ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి తొలిదశ నిర్మాణ పనులు పూర్తి
- ఆ రోజు నుంచే భక్తులకు మూల విరాట్ దర్శనానికి అనుమతి
- 2024 డిసెంబర్ 30 వరకు 1, 2 అంతస్థుల పనులు పూర్తి
- ముమ్మరంగా సాగుతున్న రామ మందిర నిర్మాణ పనులు
- రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నిపేంద్ర మిశ్రా వెల్లడి
విధాత: అయోధ్య (Ayodhya Ram Temple) లో రామమందిరం తొలిదశ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి పూర్తవుతాయని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నిపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆ రోజు నుంచే స్వామివారిని (మూలవిరాట్) దర్శించుకునేందుకు భక్తులను అనుమతిస్తామని చెప్పారు.
2024 చివరి నాటికి మొదటి, రెండవ అంతస్థులకు తుది మెరుగులు దిద్దుతామని ఆయన తెలిపారు. డిసెంబర్లో మొదటి దశ నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులు రాముడి దర్శించడం కోసం అనుమతిస్తామని మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు.
గ్రౌండ్ ఫ్లోర్లో ఐదు మండపాల నిర్మాణం
గ్రౌండ్ ఫ్లోర్లో ఇతర పనులతో పాటు ఐదు మండపాల నిర్మాణం మొదటి దశలో పూర్తి చేస్తామని మిశ్రా చెప్పారు. ఐదు మండపాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది శ్రీరాముని విగ్రహం ఉంచబడే గర్భగుడి అని పేర్కొన్నారు.
రామ మందిర నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. కాగా, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత వారం అయోధ్యలోని ఆలయంలో భాగమైన రాళ్లపై చెక్కబడిన విగ్రహాల ఫొటోలను విడుదలచేసిన సంగతి తెలిసిందే.
3,600 విగ్రహాల ప్రతిష్ఠ
వచ్చే ఏడాది నాటికి రాముడి విగ్రహం కాకుండా, ఆలయంలో హిందూ శాస్త్రాల ఆధారంగా 3,600 విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. రామ మందిరం గోడలపై అనేక మతపరమైన ఇతివృత్తాలను వర్ణించనున్నారు.
న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్తో సహా మత పెద్దలు, కళా నిపుణుల బృందం ఇతివృత్తాలపై తుది నిర్ణయం తీసుకోనున్నది. రామ మందిరం నిర్మాణ పనులకు 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రధాన ఆలయంతో పాటు మందిర ప్రాంగణంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్లు, పరిశోధనా కేంద్రం కూడా ఉంటాయి.