విధాత, హైదరాబాద్ : బీహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో నీతీశ్తో పాటు డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా సహా పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. గవర్నర్ ఆరీఫ్ ఖాన్ వారితో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 10వ సారి ప్రమాణం చేయడం విశేషం. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ లో మరోసారి కొలువుతీరగా…సీఎంతో పాటు 19 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో 10 మంది బీజేపీ నుంచి, 6గురు జేడీయూకు చెందిన వారు ఉన్నారు. రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం), హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం), లోక్ జన్శక్తి (రాంవిలాస్)కు ఒక్కో మంత్రి పదవి దక్కాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు గానూ నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే 202 సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఆ పార్టీ 101 సీట్లలో పోటీ చేసి 89 చోట్ల గెలుపొందింది. 101 సీట్లలో పోటీ చేసిన జేడీయూ 85 చోట్ల విజయం సాధించింది. బీహార్లో అత్యధిక కాలం పనిచేసిన సీఎం నీతీశ్ కుమార్.. ఇప్పటివరకు దాదాపు 19 ఏళ్లు పదవిలో ఉన్నారు. 2000 సంవత్సరంలో ఏడు రోజులు మాత్రమే సీఎంగా పనిచేశారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించడంతో పదోసారి సీఎంగా ప్రమాణం చేశారు.
