– ఆపార్టీ నేతల పాస్ పోర్టులు సీజ్ చేయాలి
– లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉంది
– పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు
– తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
– బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతే
– బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కుమార్
విధాత బ్యూరో, కరీంనగర్: అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబసభ్యులు సహా మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేనిపక్షంలో వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు. పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ, కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన అధికారుల పాస్ పోర్టులను సైతం సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ ను ఈ విషయంలో మినహాయించాలని కోరారు. కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్ లో శనివారం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారుల సమావేశం జరిగింది. కరీంనగర్, వేములవాడ జిల్లాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవిసహా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో తెలంగాణను పెట్టామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు చెబుతుండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
‘ఆ మాటలు అనడానికి సిగ్గుండాలే.. తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఫస్ట్ నాడే జీతాలెందుకివ్వలేకపోయారు? రూ.6 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను సర్వనాశనం ఎందుకు చేశారు? ప్రభుత్వ భూములన్నీ ఎందుకు అమ్ముకున్నారు? నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకియ్యలేదు? నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, తెలంగాణలోనూ మోదీగాలి వీస్తోందని చెప్పారు. మనకు పోటీ కాంగ్రెస్ మాత్రమే.. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సోదిలో కూడా ఉండదని అన్నారు. మనం చేయాల్సిందల్లా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఇంటింటికీ తీసుకెళ్లడమేనన్నారు. ఈ విషయంలో కొంత వెనుకబడ్డామని, ఇకపై ప్రతిఒక్కరూ బీజేపీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని కోరారు.