– అణగారిన వర్గాలపై అగ్రవర్ణాల కుట్రలు
సాగనివ్వమని నినాదాలు
– రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం ఎదుట
పెద్దఎత్తున నిరసన, రాస్తారోకో
– నిరసనకారుల అరెస్టు
– సూర్యాపేటలో తీవ్ర ఉద్రిక్తత
విధాత, సూర్యాపేట: సూర్యాపేట దళిత మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసం రగులుకుంది. దళిత సంఘాలు, ప్రజలు మంగళవారం రోడ్డెక్కారు. రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. అణగారిన వర్గాలపై అగ్రవర్ణాల కుట్రగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నిరసనకారుల నినాదాలతో ఆప్రాంతం అట్టుడికింది. ట్రాఫిక్ స్తంభించింది. పోలీసుల రంగప్రవేశంతో నిరసన ఉద్రిక్తంగా మారింది. అగ్రవర్ణాల కుట్రలను సాగనివ్వమని సూర్యాపేట దళిత మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల నాయకులు, ప్రజలు తీవ్రంగా హెచ్చరించారు. సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని నాగభూషణం ఆధ్వర్యంలో తొమ్మిదో వార్డు ప్రజలంతా పెద్దఎత్తున తరలివచ్చారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించి మద్దతు ప్రకటించారు.
– దళిత మహిళపై అవిశ్వాసం దుర్మార్గం
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హసేన్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని నాగభూషణం ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడారు. చైర్ పర్సన్ అన్నపూర్ణపై అవిశ్వాసం అగ్రవర్ణాల కుట్రపూరిత చర్య అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈ అవిశ్వాసాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లు నిండకుండానే దళిత మహిళ అని చూడకుండా అవిశ్వాసం ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. అగ్రవర్ణాల నాయకులు ఆలోచన చేయాలని.. మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం రద్దుకు సహకరించాలన్నారు. వ్యవస్థలో కుల వివక్ష ఇంకా పోలేదని, అందుకు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసమే నిదర్శనమన్నారు.
సూర్యాపేటను శుభ్రం చేసేందుకు దళితులు కావాలి.. కానీ అధికార పీఠంపై కూర్చొనేందుకు దళితులు పనికిరారా? అంటూ ప్రశ్నించారు. 70 ఏళ్ల మున్సిపాలిటీ చరిత్రలో రిజర్వేషన్లు జరగలేదని, జనరల్ స్థానంలో దళిత మహిళకు మున్సిపల్ చైర్ పర్సన్ గా మాజీమంత్రి జగదీశ్ రెడ్డి అవకాశం కల్పించారని అన్నారు. నాటి నుంచి దళిత చైర్ పర్సన్ ను జీర్ణించుకోలేని అగ్రవర్ణాలు కుట్రపూరితంగా ఎలాగైనా దింపాలని పన్నాగాలు పన్ని నేడు దాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 15 శాతం ఉన్న అగ్రవర్ణాలు 85% ఉన్న బడుగు బలహీన వర్గాలను శాసిస్తామంటే ఊరుకునేది లేదని, ఐక్యంగా ఉండి దెబ్బకు దెబ్బ కొడతామని హెచ్చరించారు. వెంటనే దళిత మున్సిపల్ చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో కుక్కకాటుకు చెప్పు దెబ్బలా తగిన బుద్ది చెబుతామని అన్నారు. రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగి వాహనాలు నిలిచిపోయాయి. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కలగజేసుకొని రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బోలెద్దు దశరథ, బోడ శ్రీరాములు, పాలడుగు పరశురాములు, అశోధా రవి, దాసరి దేవయ్య, దైదా వెంకన్న, మద్దూరి కుమార్, దళిత సంఘాల నాయకులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.