– రూ.2 లక్షల మేరకు రుణ మాఫీపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి
– సీఎం రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను మంగళవారం నుండి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై సోమవారం ఆయన హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ రామ కృష్ణ రావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రైతులకు మంగళవారం నుండే రైతు బంధు నిధులను సంబంధిత రైతుల ఖాతాల్లో వేసే ప్రక్రిను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు.
రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ రూపొందించాలి
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల మేరకు రుణమాఫీ చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుండి ప్రజావాణిగా పిలవాలని సీఎం ఆదేశించారు.
ఈ ప్రజావాణిని ఇకనుండి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతి రావు పూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.