Secunderabad To Goa Trains | గోవా వెళ్లాలనుకునే పర్యాటకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలును తీసుకువచ్చింది. ఈ రైలును ఆదివారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నెల 9 నుంచి రెగ్యులర్గా అందుబాటులోకి రానున్నది. సికింద్రాబాద్ – వాస్కోడిగామా మధ్య వారానికి రెండురోజులు అందుబాటులో ఉండనున్నది. సికింద్రాబాద్ నుంచి ప్రతి బుధ, శుక్రవారాల్లో వాస్కోడిగామాకు బయలుదేరుతుంది. తిరిగి గురు, శనివారాల్లో వాస్కోడిగామా నుంచి అందుబాటులో ఉంటుంది. గతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గోవాకు నేరుగా రైళ్లు లేవు. కాచిగూడ నుంచి రైలు ఉన్నా బెర్తులు దొరకడం కష్టంగా ఉండేది. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు రైలును ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించగా.. ఇటీవల రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో రైలును ప్రారంభించేందుకు ఏర్పాటు చేసింది. ఈ రైలు స్లీపర్, థర్డ్ ఎకానమీ, ఫస్ట్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు తమకు నచ్చిన క్లాస్లో టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి మొదలై.. కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్, డోన్, గుంతకల్లు, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, హబ్బలి, ధార్వాడ్, లోండా, కులేం, సాన్వోర్డెమ, మడ్గావ్ మీదుగా వాస్కోడగామా స్టేషన్కు చేరుతుంది. సికింద్రాబాద్ – వాస్కోడగామా (17039) వారంలో బుధ, శుక్రవారాలు, వాస్కోడగామా – సికింద్రాబాద్ (17040) గురు, శనివారాల్లో రాకపోకలు సాగిస్తాయి. ఇక రైలులో స్లీపర్ క్లాస్కు రూ.440, థర్డ్ ఎకానమీకి రూ.రూ.1100, ఏసీ త్రీటైర్కి రూ.1185, సెకండ్ ఏసీకి రూ.1700, ఫస్ట్ ఏసీకి రూ.రూ.2860గా దక్షిణ మధ్య రైల్వే టికెట్ ధరలను నిర్ణయించింది. రైలు సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.