దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ అయింది. భారత్ గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సూచిస్తున్నాయి. నిర్ణీత గడువు అయిన 2026 జూన్ 30లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా నిజమైన లబ్ధిదారులకే సబ్సిడీ అందేలా చూడాలని భావిస్తోంది.

గతంలో నకిలీ కనెక్షన్లు, డూప్లికేట్ వినియోగదారుల కారణంగా ప్రభుత్వానికి భారీ నష్టం జరిగినట్లు గుర్తించిన అధికారులు, ఇప్పుడు డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేస్తున్నారు.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన Hello BPCL App ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి LPG విభాగంలోకి వెళ్లి ఆధార్ ఆధారిత ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అధికారికంగా అప్డేట్ అవుతుంది.

ఎల్పీజీ సబ్సిడీ ప్రస్తుతం కోట్లాది కుటుంబాలకు కీలక ఆర్థిక ఉపశమనంగా ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలు సబ్సిడీపై ఆధారపడుతున్నాయి.

అయితే ఈ-కేవైసీ చేయని వారికి మార్కెట్ ధరలకే సిలిండర్ కొనాల్సి రావడంతో నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్యాస్ ధరలు రాష్ట్రానికొక విధంగా ఉండగా, సబ్సిడీ లేకుండా సిలిండర్ కొనడం సామాన్య కుటుంబాలకు భారంగా మారవచ్చు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి సరైన వ్యక్తులకు చేరడం. ఆధార్ అనుసంధానం, డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా అక్రమ కనెక్షన్లను గుర్తించడం సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లు, ఆధార్ వివరాలను అనుసంధానం చేయని అనేక కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం.

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అవగాహన తక్కువగా ఉండటం వల్ల చాలామంది వినియోగదారులు ఈ ప్రక్రియపై ఇంకా స్పష్టత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, స్మార్ట్‌ఫోన్ వినియోగం తెలియని వారు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఆయిల్ కంపెనీలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

సైబర్ మోసాల ప్రమాదం కూడా పెరుగుతున్న నేపథ్యంలో అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారానే ఈ-కేవైసీ పూర్తి చేయాలని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. తెలియని లింకులు, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచిస్తున్నాయి. ఒకసారి ఈ-కేవైసీ పూర్తి అయితే సబ్సిడీ పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు .

ఎల్పీజీ పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ ఆధారితంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఇతర సంక్షేమ పథకాల మాదిరిగానే గ్యాస్ సబ్సిడీ కూడా పూర్తిగా ఆధార్ ధృవీకరణ ఆధారంగానే కొనసాగనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.