దేశంలోని కొన్ని ప్రాంతాలలో తలసరి పెట్రోల్ వినియోగం జాతీయ సగటుతో పోలిస్తే ఊహించని రీతిలో అనేక రెట్లు ఎక్కువగా నమోదవుతోంది. ఈ గణాంకాలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ & అనాలిసిస్ సెల్ (PPAC) తాజాగా విడుదల చేసింది.

ఈ జాబితాలో పర్యాటక స్వర్గధామం గోవా అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ప్రతి 100 మందికి రోజువారీ పెట్రోల్ వినియోగం 52.4 లీటర్లుగా నమోదైంది, ఇది జాతీయ సగటు కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

గోవా తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి (41 లీటర్లు), చండీగఢ్ (37.8 లీటర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పర్యాటకుల రాక అధికంగా ఉండటం, అద్దె వాహనాల వినియోగం, తక్కువ దూరాలకు కూడా సొంత వాహనాలపై ఆధారపడే సంస్కృతి ఉండటమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దీనికి పూర్తి భిన్నంగా, బీహార్ రాష్ట్రం అతి తక్కువ ఇంధన వినియోగంతో జాబితాలో అట్టడుగున నిలిచింది. ఇక్కడ ప్రతి 100 మందికి రోజుకు కేవలం 3.3 లీటర్ల పెట్రోల్ మాత్రమే వినియోగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ (5.1 లీటర్లు) కూడా తక్కువ వినియోగం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉంది.

ఈ గణాంకాలు ఆయా రాష్ట్రాల్లో తక్కువ వాహన సాంద్రతను, ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను లేదా ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ వినియోగ సరళి మరొక ఆసక్తికరమైన చిత్రాన్ని ఆవిష్కరించింది.

దేశవ్యాప్తంగా డీజిల్ సగటు వినియోగం ప్రతి 100 మందికి 21 లీటర్లుగా ఉండగా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఇది అత్యధికంగా 144 లీటర్లకు చేరుకుంది. లడఖ్‌లో 111 లీటర్లుగా నమోదైంది. భౌగోళిక పరిస్థితులు, భారీ యంత్రాల వినియోగం..

రవాణా కష్టతరంగా ఉండే కొండ ప్రాంతాలలో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉండటం సహజమని అధికారులు వివరిస్తున్నారు. ఇక్కడ కూడా బీహార్ (6 లీటర్లు), ఢిల్లీ (8 లీటర్లు) వంటి ప్రాంతాలు తక్కువ వినియోగంతో కింద వరుసలో ఉన్నాయి.