YS Sharmila | వైఎస్సార్ విగ్రహాల ధ్వంసంపై షర్మిల మండిపాటు

రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌. షర్మిలారెడ్డి స్పష్టం చేశారు

  • Publish Date - June 9, 2024 / 01:11 PM IST

రౌడీ చర్యలను అంతా ఖండించాల్సిందే

విధాత: రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌. షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయమన్నారు. దివంగత నేతల విగ్రహాల ధ్వంసానికి పాల్పడే రౌడీ చర్యలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖండించి తీరాల్సిందేనని, ఇలాంటి ఘటనలు పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని మండిపడ్డారు.

వైఎస్సార్ తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న విశేష ప్రజాదరణ పొందిన నాయకుడని గుర్తు చేశారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకమని, అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. తాజా ఎన్నికల్లో గెలుపు ఓటములు దివంగత వైఎస్సార్‌కు ఆపాదించడం తగదని, వైఎస్సార్ ను అవమాయించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు, బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని పేర్కోన్నారు.

Latest News