రేపే వంస‌త పంచ‌మి.. ఇలా చేస్తే జ్ఞానంతో పాటు ధ‌నం, విజ‌యం..!

వ‌సంత రుతువులో వ‌చ్చే తొలి ప‌ర్వ‌దినం వ‌సంత పంచ‌మి. ఈ నెల 14వ తేదీన వ‌సంత పంచ‌మి జ‌రుపుకోనున్నారు. వ‌సంత పంచ‌మి రోజున స‌ర‌స్వ‌తీ దేవీని పూజిస్తారు.

  • Publish Date - February 13, 2024 / 03:51 AM IST

వ‌సంత రుతువులో వ‌చ్చే తొలి ప‌ర్వ‌దినం వ‌సంత పంచ‌మి. ఈ నెల 14వ తేదీన వ‌సంత పంచ‌మి జ‌రుపుకోనున్నారు. వ‌సంత పంచ‌మి రోజున స‌ర‌స్వ‌తీ దేవీని పూజిస్తారు. పిల్ల‌ల‌కు ఈ రోజున విద్యాభ్యాసం మొద‌లు పెడితే వారు ఉన్న‌త విద్యావంతులు అవుతార‌ని విశ్వాసం. కాబ‌ట్టి వ‌సంత పంచ‌మి రోజున స‌ర‌స్వ‌తీ దేవీ ఆల‌యాల‌న్నీ పిల్ల‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంతపంచమి రోజు బాసరలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు.

సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కానీ సరస్వతీ దేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది. తత్వ విచారానికీ, పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలం మీద ఆశీనులై ఉంటుంది. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆమెకు తొలిపూజలందిస్తారు.

ఏ స‌మ‌యంలో పూజించాలి..?

సరస్వతి దేవిని తెల్లటి వస్త్రాలతో ఉద‌యం స‌మ‌యంలో పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. తెలుపు రంగు సరస్వతీదేవికి ఇష్టమైన రంగు. కాబ‌ట్టి పిల్ల‌లు, భ‌క్తులు తెలుపు రంగు వ‌స్త్రాల‌ను ధ‌రించి పూజిస్తే మంచిది. స‌రస్వ‌తీ దేవిని కూడా తెలుపు రంగు వ‌స్త్రాల‌తో అలంక‌రించాలి. ఇక పాలు, తెల్ల నువ్వుల‌తో చేసిన ప‌దార్థాల‌ను స‌ర‌స్వ‌తీ దేవీకి నైవేద్యంగా పెట్టి, పూజించాల‌ని చెబుతున్నారు.

ఆ పూల‌తో పూజిస్తే విజ‌యం..!

ఇక వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఏ విధంగా పూజిస్తే విజయం సిద్ధిస్తుంది. ధనం లభిస్తుంది వంటి వివరాలను తెలుసుకుంటే.. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఎర్రటి పువ్వులతో పూజిస్తే మంచిదని చెబుతున్నారు. ఇది విజయాన్ని చేకూరుస్తుందని చెబుతున్నారు. అంతేకాదు వసంత పంచమి నాడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకొని ఇల్లంత శుభ్రం చేసుకుని సరస్వతి దేవికి పూజ చేసి ఆ తల్లిని ప్రార్థించుకోవడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుందని సూచిస్తున్నారు. విద్యార్థులు చదువుల ముందు ఉండాలంటే సరస్వతి దేవి విగ్రహాన్ని స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడం మంచిదని, విద్య పై ఏకాగ్రత పెరిగేలా సరస్వతి దేవి చేస్తుందని తద్వారా జ్ఞానం లభిస్తుందని చెబుతున్నారు. ఎవరైనా వసంత పంచమి నాడు భక్తిశ్రద్ధలతో సరస్వతి దేవిని పూజిస్తే ధనం, ఆరోగ్యం మాత్రమే కాకుండా విజయం కూడా సొంతమవుతుందని చెబుతున్నారు.


Latest News