Chhattisgarh | ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. అందుకే ఎలాంటి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగించుకోవటం ప్రజల ప్రధాన కర్తవ్యం. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది.
కానీ ఓ 40 గ్రామాలకు చెందిన ప్రజలు మాత్రం 40 ఏండ్ల పాటు ఓటుకు దూరంగా ఉన్నారు. ఈ 40 ఏండ్లలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు జరిగిన ఏ ఎన్నికలోనూ వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. 40 ఏండ్ల తర్వాత 40 గ్రామాల ప్రజలు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలు అవి. ఒకట్రెండు కాదు.. ఏకంగా 40 గ్రామాల ప్రజలు.. 40 ఏండ్లలో ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎందుకంటే.. మావోయిస్టుల భయంతో ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు భయపడేవారు. ఒక వేళ పోలింగ్ నిర్వహించినా, ముందే పోలింగ్ కేంద్రాలను ధ్వంసం చేసేవారు.
ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఆ 40 గ్రామాల్లో 120 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పోలీసులు సహకారంతో ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. గత ఐదేండ్ల నుంచి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించారు. మావోయిస్టుల అలజడి లేకుండా చేశారు. దీంతో అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
ఈ సందర్భంగా బస్తర్ ఐజీపీ సుందర్ రాజ్ మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలోనే బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాల్లో నవంబర్ 7వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన 40 గ్రామాల్లోనూ పోలింగ్ నిర్వహిచేందుకు ఎన్నికల అధికారులు, పోలీసు బలగాలు ప్రక్రియ ప్రారంభించాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.