Site icon vidhaatha

Airtel | వినియోగదారులకు షాక్‌ ఇవ్వబోతున్న ఎయిర్‌టెల్‌..! ఛార్జీల పెంపుపై సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు..

Airtel | యూజర్లకు షాక్‌ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్‌ సిద్ధమవుతున్నది. త్వరలోనే మొబైల్‌ రీఛార్జీలను పెంచబోతున్నది. ఈ క్రమంలో భారతీ ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విట్టల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో మొబైల్ ఛార్జీలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై కంపెనీ సగటు ఆదాయం (APU) సుమారు రూ. 200గా ఉందని, నిజానికి ఇది దాదాపు రూ.300 ఉండాల్సి ఉందన్నారు. అయితే, రూ.300కు పెంచిన ఇదే ప్రపంచంలోనే అత్యల్ప ఏఆర్‌పీయూగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆర్థిక సంవత్సరం-2024 నాలుగో త్రైమాసికానికి ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ రూ.209కు చేరిందని చెప్పారు. 2023 నాలుగో త్రైమాసికంలో రూ.193గా ఉందని తెలిపారు. టెలికం రంగంలో టారిఫ్‌ రేట్లలో ప్రధాన సవరణ చేయాల్సిన అవసరం ఉందని విట్టల్ అభిప్రాయపడ్డారు. గత రెండు త్రైమాసికాల్లో ఏఆర్‌పీయూలో పెరుగుదల ఉందని, అయితే మరిన్ని పెంపులు అవసరమని చెప్పారు. ఎయిర్‌టెల్ నాలుగో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలోనే ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు గణనీయంగా పెరగవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధరల పెంపుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. త్వరలోనే ఎయిర్‌టెల్ ప్లాన్‌లు మరింత ప్రియం కావడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version