Rashmika Mandanna and Vijay Deverakonda To Tie The Knot in February 2026 in Udaipur
(విధాత వినోదం డెస్క్)
హైదరబాద్: చాలా కాలంగా అభిమానుల మధ్య ఊహాగానాలకు కారణమవుతున్న టాలీవుడ్ స్టార్ జంట రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ వివాహ వార్తలు చివరికి నిజం కాబోతున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ప్రేమ జంట 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఘనంగా పెళ్లి చేసుకోబోతోందట. ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది.
ఇక అక్టోబర్ 3, 2025న వీరిద్దరూ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ప్రాంగణంలో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు వచ్చిన విషయం విదితమే. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. మీడియా దృష్టికి రాకుండా, పూర్తి గోప్యతతో ఆ కార్యక్రమం జరిగిందని తెలిసింది.
దక్షిణ భారత–రాజస్థానీ సంప్రదాయాల కలయికలో వివాహ వేడుక
India Today కథనం ప్రకారం, పెళ్లి వేడుక దక్షిణ భారత సంప్రదాయాలు మరియు రాజస్థానీ శైలిని మిళితం చేసే విధంగా ఉండబోతోంది. ఉదయ్పూర్ మహల్లో జరిగే ఈ వేడుకను ‘సింపుల్ బట్ గ్రాండ్’ కాన్సెప్ట్తో ప్లాన్ చేస్తున్నారని, వేడుకలో మీడియాకు ప్రవేశం ఉండదని తెలుస్తోంది.
ఇక ఇటీవల రష్మిక తన కొత్త సినిమా థమ్మా ప్రమోషన్ ఈవెంట్లో జర్నలిస్టులు నిశ్చితార్థం గురించి అడిగినప్పుడు, సిగ్గుతో నవ్వుతూ “అందరికీ తెలుసు గదా” అని చెప్పిన సమాధానం అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. అదే సమయంలో అభిమానులు దీన్ని ఆమె నిశ్చితార్థానికి ధృవీకరణగా భావించారు.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల నుండి మొదలైన ఈ జంట మధ్య బంధం, ఇప్పుడు జీవిత భాగస్వామ్యంగా మారబోతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, అన్ని సంకేతాలు అదే దిశగా సాగుతున్నాయి — అంటే, ఫిబ్రవరి 2026లో “డ్రీమ్ వెడ్డింగ్” ఖాయం!
