భారతీయుల్లో చాలా మంది నీళ్ల మాదిరిగా టీ, కాఫీలు తాగేస్తుంటారు. ఈ రెండింటిని తాగేందుకు సమయ పాలన ఉండదు. కొందరైతే బ్రష్ చేయకుండానే టీ తాగుతారు. అలా ఉదయం నుంచి మొదలుకొని అర్ధరాత్రి వరకు ఎన్నో కప్పుల టీ, కాఫీలు తాగేస్తుంటారు. లెక్కనే ఉండదు. నిరంతరం కాఫీ, టీలు తాగే వారిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
టీ, కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కెఫిన్ కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తర్వాత ఇతర మానసిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీని మితంగా తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. వీలైనంత వరకు టీ, కాఫీ తీసుకోకపోవడం మంచిది. 150 మి.లీ. కాఫీలో 80 -120 మి.గ్రా. కెఫిన్ ఉంటుంది. టీలో 50-65 మి.గ్రా. కెఫిన్ ఉంటుంది. అయితే రోజుకు 300 మి.గ్రా. వరకు కెఫిన్ తీసుకోవచ్చు. అంటే రోజుకు ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే టీ గానీ, కాఫీ గాని తాగొచ్చు. కెఫిన్ అధికంగా తీసుకుంటే ఆక్సిజన్ సరఫరాకు, శక్తి ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. తద్వారా మానసిక సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.
ఇంకో ప్రధాన నిబంధనం ఏంటంటే.. భోజనానికి గంట ముందు, గంట తర్వాత కాఫీ, టీలు తాగకూడదని ఐసీఎంఆర్ ఆదేశించింది. అంటే భోజనానికి గంట ముందు లేదా గంట తర్వాత కాఫీ, టీ సేవించాలి. అలా సమయ పాలన పాటించకుండా కాఫీ, టీ తీసుకుంటే.. అందులో ఉండే టానిన్స్.. శరీరంలో ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. దీని ప్రభావం జీర్ణ వ్యవస్థపై పడుతుంది. ఐరన్ శోషణను నిరోధించడంతో రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది.