Savings Schemes | మధ్య తరగతి ప్రజలు ఒక వేళ తమ డబ్బు( Money )ను దాచుకోవాలనుకున్న, వడ్డీ అధికంగా రావాలన్నా.. ఈ మూడు స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు బ్యాంక్ ఎఫ్డీల( Fixed Deposits ) కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో వడ్డీ ప్రతి ఆరు నెలలకోసారి ‘కాంపౌండ్’ (చక్రవడ్డీ) అవుతూ మీ సంపదను పెంచుతాయి.మరి అద్భుతమైన ఆ మూడు స్కీమ్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
1. సుకన్య సమృద్ధి యోజన (SSY)
మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. ఆమె భవిష్యత్తు కోసం ఇంతకంటే మంచి పథకం మరొకటి లేదు. ఇది కేవలం సేవింగ్స్ స్కీమ్ మాత్రమే కాదు, ఒక గొప్ప సెంటిమెంట్ కూడా.
వడ్డీ రేటు: ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 8.2% వడ్డీ లభిస్తోంది. ఇది సాధారణ బ్యాంకు ఎఫ్డీల కంటే చాలా ఎక్కువ.
పెట్టుబడి: ఏడాదికి కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు దాచుకోవచ్చు. 15 ఏళ్ల పాటు డబ్బులు కడితే.. 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ అందుతుంది.
ట్యాక్స్ బెనిఫిట్: ఇందులో మనం పెట్టే పెట్టుబడి, వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ సొమ్ము.. ఈ మూడింటిపై రూపాయి కూడా పన్ను (Tax) కట్టాల్సిన అవసరం లేదు. ఆడపిల్లల ఉన్నత చదువులకు లేదా పెళ్లి ఖర్చులకు ఇది ఒక పక్కా ప్లాన్.
2. RBI ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్
చాలామందికి ఈ బాండ్ల గురించి పెద్దగా తెలియదు. కానీ, ఇవి అత్యంత సురక్షితమైనవి. దీనికి స్వయంగా భారత ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.
ప్రత్యేకత: ఈ బాండ్ల వడ్డీ రేటు ప్రతి ఆరు నెలలకోసారి మారుతూ ఉంటుంది (Reset అవుతుంది). సాధారణంగా ఇది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) రేటు కంటే 0.35% ఎక్కువగా ఉంటుంది.
వడ్డీ: ప్రస్తుతం ఇందులో 8.05% వరకు వడ్డీ లభిస్తోంది. ప్రతి ఆరు నెలలకోసారి వడ్డీ డబ్బులు నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లో పడతాయి.
పరిమితి: ఇందులో కనీసం రూ. 1,000 నుండి ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు, గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే దీని ద్వారా వచ్చే వడ్డీపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
3. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
సురక్షితమైన పెట్టుబడికి నిలువుటద్దం ఈ పీపీఎఫ్. ఇది కేవలం ఉద్యోగులకే కాదు, సామాన్యులు కూడా బెస్ట్ సేవింగ్ స్కీమ్ (Saving scheme) దీని ద్వారా మంచి వడ్డీ పొందొచ్చు.
లాభాలు: ప్రస్తుతం దీనిపై 7.1% వడ్డీ రేటు ఉంది. 15 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకంలో మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి భారీ నిధి సమకూరుతుంది.
లెక్క ఇలా: మీరు ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్లు పెట్టుబడి పెడితే.. మీరు కట్టేది రూ. 22.5 లక్షలు. కానీ, చక్రవడ్డీ పుణ్యమా అని మెచ్యూరిటీ నాటికి మీకు సుమారు రూ.42 నుండి రూ. 43 లక్షల వరకు అందుతాయి.
ట్యాక్స్ ఫ్రీ: సుకన్య సమృద్ధి లాగే ఇందులో కూడా మెచ్యూరిటీ అమౌంట్ పై ఎలాంటి పన్ను ఉండదు.
