విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy)నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) అసలు గ్లోబల్ సమ్మిట్ లాగా లేదని..భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పో(real estate expo) మాదిరిగా సాగిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు( Harish Rao) విమర్శించారు. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుందని, అందాల పోటీల్లాగే, ఏఐ సమ్మిట్ లాగే.. గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయ్యిందని ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. రెండేళ్ల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన పీఆర్ స్టంట్ గ్లోబల్ సమ్మిట్ అని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రకటించిన విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు అని, విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ లో కమిట్మెంట్ లేదు. ఆ డాక్యుమెంట్ కు శాంటిటీ లేదు? అని, అక్షరాలు, అంకెలు, రంగు రంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్ధాలు, అర్థ సత్యాల ‘విజన్ లెస్’ డాక్యుమెంట్ అది అని విమర్శించారు.
ఒక్క సీఎం కూడా సమ్మిట్ కు రాలేదు
గ్లోబల్ సమ్మిట్ అని మూడు నెలల నుంచి ఊదరగొట్టారని, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తారని చెప్పారని, మంత్రులు పోయి ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయంగా ఆహ్వాన పత్రికలు అందించారని, కనీసం ఒక్క ముఖ్యమంత్రి రాలేదు, 5వేల మంది విదేశీ రిప్రెజంటేటివ్స్ రాలేదు. ఒక్క మీ పార్టనర్ డీకే శివకుమార్ తప్ప అని హరీష్ రావు చురకలేశారు. చివరకు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని పరిస్థితి ఎదురైందని, గ్లోబల్ సమ్మిట్ లో గ్లోబల్ రిప్రెజెంటేటివ్స్ కరువయ్యారని, ఆఖరుకు ఎంబీఏ విద్యార్థులను, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కోట్ వేసి తెచ్చి కూర్చోబెట్టారని, గ్లోబల్ సమ్మిట్ కాదు అది లోకల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో ఇది అని విమర్శించారు. రేవంత్ గ్లోబల్ సమ్మిట్ పీఆర్ స్టంట్ గా భావించి రాహుల్, ప్రియాంక, ఖార్గేలు ముఖం చాటేసారని ఎద్దెవా చేశారు.
రియల్ ఎస్టేట్ కోసమే అక్కడ గ్లోబల్ సమ్మిట్ హడావుడి
ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, ఆ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అని.. అందమైన కట్టుకథను రేవంత్ రెడ్డి అల్లాడని, బయో స్కోప్ సినిమా చూపించాడని హరీష్ రావు దుయ్యబట్టారు. భూముల స్కాం అయిపోయింది..పవర్ స్కాం అయిపోయింది..లిక్కర్ స్కాం అయిపోయింది..ఇప్పుడు ఇగ రియల్ ఎస్టేట్ స్కాం మొదలు పెట్టిండని ఆరోపించారు. రేవంతు గ్లోబల్ సమ్మిట్ పెట్టింది ఫోర్త్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమే కానీ, పెట్టుబడుల కోసం కాదు అని అందరికీ అర్థం అయ్యిందన్నారు. ఫార్మా సిటీ పక్క భూములను ముందుగానే రేవంత్ రెడ్డి తన బినామీలతో కొనిపించి లే అవుట్లు చేసి రెడీగా పెట్టుకున్నాడన్నారు. ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టీ, ఆ భూములను తెగ నమ్మడానికి ప్లాన్ వేశాడని ఆరోపించారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాం కు తెరతీశాడన్నారు.
పెట్టుబడులతో కట్టుకథలు
పెట్టుబడులు తెచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. రెండేళ్లుగా పెట్టుబడుల పేరిట కట్టు కథలు తప్ప చేసింది ఏం లేదని హరీష్ రావు విమర్శించారు. 2024 జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి దావోస్ సమావేశానికి వెళ్లారని, 40,232 కోట్ల పెట్టుబడులు సాధించినం అని, 2,500 ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తయని చెప్పారన్నారు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ నెలలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ -2024 నిర్వహించిందని, 100 దేశాల కంపెనీలు పాల్గొన్నరూ, 20 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నం అని డబ్బా కొట్టారని, ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయన్ని నిలదీశారు. జనవరి 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావాస్ లో జరిగిన సమావేశం సీఎం, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారని, పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నం అని అక్కడ ఎంతో తిరిగినట్లు, ఎంతో కష్ట పడ్డట్లు సూటు బూటు వేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టించుకున్నారన్నారు. అంతా అయిపోయాక 16 ప్రపంచ అగ్రగామి కంపెనీలతో సుమారు 1లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల (1.78లక్షల కోట్లు) పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నదని ఘనంగా ప్రకటించారు. ఈ ఒప్పందాల ద్వారా 49,550 ఉద్యోగాలు వస్తాయని చెప్పారని, ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు.
దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయ్
విదేశీ పర్యటనలు, గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం చూస్తే, ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల వలే ఉన్నాయని హరీష్ రావు విమర్శించారు. పెట్టుబడులు తెస్తం అని రెండు సార్లు దావోస్ పోయారని, అమెరికా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్, , జపాన్ లలో పర్యటించారని, ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయని హరీష్ రావు ప్రశ్నించారు. నిన్న, మొన్న రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏకంగా 5లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు అని ప్రచారం చేసున్నారన్నారు. .రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి నువ్వు తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయో సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు. దావోస్ పెట్టుబడులు, అమెరికా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ కంపెనీలు ఎక్కడకు పోయాయి, పెట్టుబడులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.
క్యూర్, ప్యూర్, రేర్ కాదు..ఆయన తెలంగాణ చోర్
క్యూర్, ప్యూర్, రేర్ అంటూ అంటున్న సీఎంరేవంత్ రెడ్డి తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ అని హరీష్ రావు విమర్శించారు. 2025-26 బడ్జెట్ ప్రసంగంలో మెగా మాస్టర్ ప్లాన్ 2050 అన్నారు. ఒక్క చోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా, పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు, హైదరాబాద్ తరహాలోనే అభివృద్ది చేస్తామని చెప్పారని, ఇప్పుడేమే ఫ్యూచర్ సిటీ పేరిట ఒకే ప్రాంతంలో పరిశ్రమల కేంద్రీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మీ చెత్త విధానాలను చూసి ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు.ఫ్యూచర్ సిటీ అని ఫార్మాసిటీని బొంద పెట్టినవు కాబట్టే సిగాచి ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్ వంటి హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీలు ఆంద్రాకు తరలివెళ్లాయన్నారు.
రాహుల్ మాటలకు విరుద్దంగా అంబానీ, ఆదానీలకు ఎర్ర తివాచీ
అంబానీలు, ఆదానీలు దేశాన్ని దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ చెబుతుంటే, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి మాత్రం అంబానీ, ఆదానీలకు తెలంగాణను అమ్మేస్తున్నాడని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆలోచనలు పక్కన బెట్టి అదానీ, అంబానీ ప్రతినిధులకు రేవంత్ ఎర్ర తివాచీ పరచడంలో ఆంతర్యం ఏమిటీ ? అని ప్రశ్నించారు.
విమర్శలు రావడం తో గతంలో అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల రూపాయల విరాళం చెక్కును వెనక్కు పంపిన రేవంత్ ర్డి.. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమంలో అదానీ కుమారుడు కరణ్ అదానీతో ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ ముఖ్య నేతల బినామీలతోనే ఒప్పందాలు జరిగాయని… ఆ పూర్తి వివరాలు త్వరలో బయటపెడుతాం అని హరీష్ రావు తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్ వేదికగా వెల్లడైన బీఆర్ఎస్ అభివృద్ధి
గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రికార్డు స్థాయి తెలంగాణ అభివృద్ధి గురించి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వివరించాని, తెలంగాణ ఒక మోడల్ అంటూ పొగడ్తలు కురిపించారని హరీష్ రావు గుర్తు చేశారు. అదే వేదిక నుండి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు..కేసీఆర్ పాలనలో వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ళ పాలన గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడే రేవంత్ రెడ్డి వారి చెప్పిన మాటు వినైనా బుద్ధి తెచ్చుకోవాలని, చేతనైతే ఆ అభివృద్ధిని కొనసాగించి చూపాలని హరీష్ రావు హితవు పలికారు.
