విధాత, వరంగల్: నాలుగేళ్ల పాపపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఇరవై ఏళ్లు జైలు శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించారు. 20 యేళ్ళ జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ జడ్జి నారాయణబాబు శనివారం తీర్పు వెల్లడించారు.
2019 సంవత్సరంలో మహముత్తారం మండల పరిధిలో నాలుగేళ్ల పాపపై అత్యాచారానికి పాల్పడిన భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన రాస కొమురయ్య (36) కు ఇరవై ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ జడ్జి తీర్పు వెల్లడించారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే వివరాలిలా ఉన్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాస కొమురయ్య 2019 డిసెంబర్ 31న రాత్రివేళ మహముత్తారం మండల పరిధిలోని ఓ గ్రామంలో ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ఆ సమయంలో నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని గ్రామ శివారులోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు మహముత్తారం పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పటి కాటారం డీఎస్పీ బోనాల కిషన్ అత్యాచార ఘటనపై విచారణ చేపట్టి చార్జిషీట్ ఫైల్ చేశారు. గత కొంతకాలంగా ఈ అత్యాచారం కేసులో కొమరయ్యను కోర్టు విచారించింది. వాదోపవాదనలు విన్న తర్వాత రాస కొమురయ్యను దోషిగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి నారాయణబాబు తీర్పు వెల్లడించారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోగికార్ శివరాజును, సమగ్ర దర్యాప్తు చేపట్టిన అప్పటి కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ను, కోర్టు ట్రయల్ ను నడిపించిన కాటారం సీఐ రంజిత్ రావును, మహముత్తారం ఎస్సై రమేశ్ను, సాక్షులను ప్రవేశపెట్టిన ఏఎస్ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ భూమయ్యను జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డి అభినందించారు.