విధాత: హిందుత్వ శక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇండోర్ యూనివర్సిటీ లైబ్రరీలో హిందువులను కించపరిచే పుస్తకాలున్నాయని కాలేజీ ప్రిన్సిపాల్ పైనే దాడి చేశారు. లైబ్రరీ భవనంపై రాళ్లతో దాడికి దిగారు. ప్రిన్సిపాల్తో పాటు ఇతర ముస్లిం ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇండోర్లోని న్యూగవర్నమెంట్ లా కాలేజీ అకడమిక్ విలువలకు, సత్సంప్రదాయాలకు ప్రతీతి. ఆ కాలేజీ లైబ్రరీలో న్యాయపరమైన విషయాల గురించిన విస్తారమైన పుస్తకాలున్నాయి. ప్రముఖ రచయిత ఫర్హఖాన్ రాసిన ‘కలెక్టివ్ వాయిలెన్స్ అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్’ పుస్తకం ఉన్నది.
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలుగా ఉన్న వీహెచ్పీ, ఏబీవీపీ, బీజేపీ ఎలాంటి హింసాత్మక మూకదాడులకు పాల్పుడుతున్నాయని ఆ పుస్తకంలో ఉన్నది. అవన్నీ కేవలం పుక్కిటి పురాణాలుగా, వ్యక్తిగత అభిప్రాయాలుగా కాకుండా… నిర్దిష్టమైన ఘటనల ఆధారంగా హిందుత్వ సంస్థలు ఎలా హింసకు పాల్పడుతున్నాయో ఆ పుస్తకం చెప్తుంది.
హిందుత్వ సంస్థలపై తప్పుడు ప్రచారం చేసే పుస్తకాలను లైబ్రరీలో ఎందుకు పెట్టారంటూ కాలేజీ ప్రిన్సిపాల్పై ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ దాడికి దిగింది. ప్రిన్సిపాల్ ముస్లిం కాబట్టే అలాంటి పుస్తకాన్ని లైబ్రరీలో పెట్టారని ఆరోపిస్తున్నది. అంతటితో ఆగకుండా కళాశాలలో ముస్లిం ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో ఎలా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు!
నిజానికి ఆ కాలేజీలోని 24 మంది ఉపాధ్యాయుల్లో నలుగురు మాత్రమే ముస్లింలు. ఇంకా ఆ లైబ్రరీలోనే ఏకే రామానుజన్ రాసిన ‘మూడువందల రామాయణాలు’ అన్న పుస్తకం కూడా ఉన్నది. కాబట్టి రామానుజన్ను కూడా హిందూ వ్యతిరేకి అని ముద్రవేసి అతని పుస్తకాన్ని కూడా నిషేధించాలని డిమాండ్ చేస్తారా? పుస్తకాలను కూడా సహించని సంస్కృతి మనుస్మృతి తప్ప ప్రజాస్వామ్య సంస్కృతి ఎంత మాత్రం కాబోదని విద్యావేత్తలు అంటున్నారు.