విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: అయ్యప్ప స్వామి ఎక్కడో ఉండరని, మాలాధారణ చేసిన ప్రతి వ్యక్తిలోనూ ఉంటారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అయ్యప్ప దీక్ష చాలా గొప్పదని, కులమత, ప్రాంత, వర్ణ, వర్గాలకు అతీతంగా ప్రతిఒక్కరూ మాలధరిస్తారని, అయ్యప్ప వారిలోనే కొలువై ఉంటారని అన్నారు.
ప్రతీ ఒక్కరు వారి వారి ఆచారాలకు తగిన విధంగా దైవ చింతనను కలిగి ఉండాలని, అలా చేయడం వల్ల మనసు అదుపు లో ఉంటుందని మంత్రి తెలిపారు. మనసు అదుపులో ఉంటే చెడు వైపు మన దృష్టి వెళ్లదని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నాని మంత్రి తెలిపారు. సూర్యాపేట లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి మహాపడి పూజోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
నియోజకవర్గ నలుమూల నుండి వేలాది గా తరలి వచ్చిన స్వాములు స్వామి శరణం.. అయ్యప్ప శరణం.. అంటూ ఆలపించిన కీర్తనలతో క్యాంపు కార్యాలయం పరిసరాలు భక్తి పారవశ్యం లో మునిగిపోయాయి. మంత్రి స్వయంగా కుమారుడితో కలిసి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాభిషేకం, పుష్పాభిషేకం, చక్రస్నానం, జలాభిషేకంతో సుమారు రెండు గంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామికి ప్రత్యేక పూలతో పుష్పాభిషేకం నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు స్వాములకు అల్పాహార ప్రసాదాలను వడ్డించారు. ఘనంగా నిర్వహించిన మహాపడిపూజలో స్వామి శరణు ఘోషతో సూర్యాపేట క్యాంపు కార్యాలయం మార్మోగింది. పడి సన్నిధానాలు, గురుస్వాములు, రుత్విజుల వేద మంత్రోచ్ఛరణలు, శరణుఘోషతో అత్యంత వైభవంగా మహాపడిపూజ సాగింది. కార్యక్రమంలో పట్టణ ప్రజలు, టీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.