తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలు ఎవరెదురొచ్చినా సీఎం కేసీఆర్ ను ఎదుర్కోలేరని రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం తథ్యమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నిడమనూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలతో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరిగిందన్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పేరుకు 15 ఏళ్ళు మంత్రిగా ఉండి మంచినీళ్లు, రోడ్లు అందుబాటులోకి తేలేకపొయారూ ఓ పెద్ద మనిషి అంటూ పరోక్షంగా జానారెడ్డికి చురకలు అంటించారు.
మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మంచినీళ్ల సౌకర్యం లేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ కూడా గుజరాత్ లో 6 గంటలు మాత్రమే ఇస్తున్నారని, దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటల ఉచిత విద్యుత్ ఉందన్నారు.
60ఏళ్లుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బీజేపీలు ఏమి అభివృద్ధి చేశాయో బేరీజు వేసుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ వచ్చిన తరువాత తెలంగాణాలో ఆకలితో ఉన్నవారు ఎవరూలేరు అనే విషయాన్ని అన్ని అంతర్జాతీయ నివేదికలు చెపుతున్నాయన్నారు.
దేశాన్ని అధోగతి పాలు చేసిన దొంగలు బీజేపీ, కాంగ్రెస్ నేతలని దుయ్యబట్టారు. 2014లో మోదీ దేశంలో తిరిగి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడని, పేదల ఖాతాల్లో లక్షల నల్ల ధనం వేస్తా అని చెప్పి అబద్ధాలతో అధికారంలోకి వచ్చాడన్నారు.
2000 రూపాయల నోట్లతో బీజేపీ నల్లధనం దాచుకుందని, ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్న మోదీ చరిత్ర హీనుడిగా మిగిలి పోతాడన్నారు. గుజరాత్ లో ఇప్పుడు కూడా పవర్ హాలిడే లు ఉన్నాయని, బీఆర్ఎస్ విధానాలను చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వణుకుపుడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా సీఎం కేసీఆర్ పాలన రావాలి అని కోరుకుంటున్నారన్నారు. ఈ దేశ రైతాంగాన్ని కాపాడాలన్న తపనతో సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ స్థాపించారన్నారు.
కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్, ఎన్. భాస్కరరావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు రామచంద్రనాయక్, తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య పాల్గొన్నారు.