విధాత : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు మనముందున్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలిపేలా వాస్తవికత దర్పణంగా రాష్ట్ర బడ్జెట్ ఉండాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారుచేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా, వృథా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. 2023-24 వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని అన్నారు. బుధవారం సెక్రెటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు, ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ రూపొందించాలని అన్నారు. అసలైన ప్రజల తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని.. అధికారులు అందుకు అనుగుణంగా బడ్జెట్ ను తయారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత.. ఉద్యోగుల జీతభత్యాలు, మనమిచ్చిన హామీలకు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు.
మనం సంతృప్తిపర్చాల్సింది ప్రజలనే
ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తిపరిచే పని లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన గురుతరమైన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని అధికారులకు గుర్తు చేశారు. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు చేయాలని కోరారు.
అప్పులు దాచాల్సిన పనిలేదు
గతంలో అప్పులు దాచి, ఆదాయ వ్యయాలను భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేనే లేదని అన్నారు. తప్పనిసరయితే తప్ప ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాల కొనుగోలు చేయకుండా, ఇప్పుడు ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలువకముందే 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసిన విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేదా.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో బేషజాలకు పోవద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, సెక్రటరీ టి.కె.శ్రీదేవి, జాయింట్ సెక్రెటరీ కె.హరిత, డిప్యూటీ సీఎం ఓఎస్డీ కృష్ణభాస్కర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.