విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: మానుకోట జిల్లాలో 12వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేస్తున్నది. మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా సీఎం పర్యటించనున్నారు. అక్కడ నూతన కలెక్టరేట్ ను సైతం ప్రారంభించనున్నారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికార ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేస్తున్నారు.
మానుకోటలో విస్తృత ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మానుకోట జిల్లాకు చెందిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గత మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోనే మకాం వేసిన మంత్రి సత్యవతి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హెలిపాడ్ ఏర్పాటు, ప్రారంభోత్సవం జరిగే ప్రాంతాలలో ఏర్పాట్లతో పాటు తగిన భద్రత చర్యలు చేపడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
1) సమీకృత కలెక్టర్ కార్యాలయం నూతన భవన ప్రారంభం
2) జిల్లాగ్రంథాలయ నూతన భవన ప్రారంభం
3) బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభం
అనంతరం కార్యక్రమానికి వచ్చే జిల్లాలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తాళ్ళపూసపల్లిరోడ్ లో హెలీప్యాడ్ పనులను మంత్రులు, అధికారులు పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా మానుకోట పూలతోటలా.. అభివృద్ధి కోటలా కనిపించాలని ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రి సత్యవతిరాథోడ్ ఆదేశించారు.
సీఎం పర్యటనకు సమయం తక్కువగా ఉన్నందున జిల్లా కలెక్టర్ శశాంక పనులను పూర్తి చేసేందుకు పై అధికారులను సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. భద్రతాచర్యలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ప్రత్యేక దృష్టి సారించారు.
భారీ స్వాగత ఏర్పాట్లు
సీఎం కార్యక్రమ విజయవంతం కోసం అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారు. జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జెడ్పీచైర్ పర్సన్ బిందు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి తదితరులు కార్యక్రమ ఏర్పాట్లలో భాగస్వామ్యం అవుతున్నారు.