Site icon vidhaatha

ఆర్థిక అసమానతలు సమాజానికి చేటు


విధాత, హైదరాబాద్: ఆర్థిక అసమానతలు పెరగడం సమాజానికి మంచిది కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడ రచన చేసిన ‘ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి’ పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఇంక్లీజీవ్ గ్రోత్ బయట ఉన్న ప్రజలను ఇంక్లీజీవ్ గ్రోత్ లోకి తీసుకురావాలని ఈ పుస్తకంలో చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారని ప్రశంసించారు.


ఈపుస్తకం దేశంతో పాటు సమాజాన్ని మార్చివేస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదన్నారు. సమాజ హితం కోసం వారు చేస్తున్న రచనలు చాలా స్ఫూర్తిదాయకం, చైతన్యవంతమైనవని అన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లుగా ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నానికి సాంకేతిక, మేధో పరంగా మద్దతు, సహకారం అందించాలని శ్యామ్ పిట్రోడాకు విజ్ఞప్తి చేశారు.


టెలీ కమ్యూనికేషన్ విప్లవానికి నాంది శ్యామ్ పిట్రోడా


టెలీ కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా తనకు స్ఫూర్తిదాయకులు అని భట్టి విక్రమార్క అన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఈ దేశంలో టెలి కమ్యూనికేషన్ రంగాన్ని తీసుకువచ్చేందుకు అమెరికాలో ఉన్న శ్యామ్ పిట్రోడా మేధస్సును గుర్తించి అడ్వైజర్ గా సేవలు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని చాలా దగ్గరగా తీసుకురావడానికి టెలి కమ్యూనికేషన్ ద్వారా భారీ విప్లవాన్ని శ్యామ్ పిట్రోడా తీసుకొచ్చారని ప్రశంసించారు.


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిగా చదువుతున్న సమయంలో మా ఇంటికి ఫోన్ చేయడానికి జనరల్ పోస్ట్ ఆఫీస్ లో ట్రంక్ కాల్ బుక్ చేసి గంటల తరబడి నిరీక్షించి ఫోన్ చేసి మాట్లాడేవాడినని భట్టి అన్నారు. ఆపరిస్థితి నుంచి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎవరితోనైనా క్షణాల్లో ఫోన్ చేసుకుని మాట్లాడే సౌకర్యం ఇప్పుడు వచ్చింది అంటే దానికి శామ్ పిట్రోడా చేసిన కృషి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, మాజీ డీజీపీ సాంబశివరావు, క్వార్డ్ వైర్లెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సీఎస్ రావు, ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేసిన పూలదాసు నరసింహారావు, సంపాదకులు డాక్టర్ డీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Exit mobile version