సవాల్ విసురుతున్న ఆసీస్ బౌలర్లు.. స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్.. పరుగులు సాధించలేకపోయిన మిడిలార్డర్..ప్రెజర్ సిచ్యుయేషన్ లో కెప్టెన్ రోహిత్ శర్మ టఫ్ ఫైట్ చేశాడు. ఆధిక్యం అందుకోకముందే మిడిల్ చేతులెత్తేసినా.. నిబ్బరంగా నిలబడ్డాడు. ప్రతి బంతిని ఆచితూచి ఆడుతూ.. ఒక్కో పరుగు చేర్చుకుంటూ జట్టును కష్టాల కడలి నుంచి తప్పించాడు. అనంతరం ఆల్ రౌండర్లు జడేజా.. అక్షర్ సూపర్ పాట్నర్ షిప్తో జట్టును భారీ ఆధిక్యం దిశగా తీసుకెళుతున్నారు. 144 రన్స్ ఆధిక్యంతో ఉన్న భారత్ ఈ మ్యాచ్ ఫలితాన్ని రూల్ చేసే స్థాయికి చేరిందనడంలో సందేహం లేదు..
(విధాత ప్రత్యేకం)
తొలి టెస్టులో టీమ్ ఇండియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు సూపర్ బ్యాటింగ్ తో సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తర్వాత ఆల్ రౌండర్లు జడేజా, అక్షర్ పటేల్ మెరుపు బ్యాటింగ్ తో మ్యాచ్ ను శాసించే స్థాయికి చేరుకుంది. ఓవర్ నైట్ స్కోరు 77/1తో రెండో రోజు ఆట ఆరంభించిన టీమిండియా 114 ఓవర్లలో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. బంతి బాగా తిరుగుతున్న పిచ్పై భారత్ ప్రస్తుతానికి తొలి ఇన్నింగ్స్లో 144 పరుగుల ఆధిక్యం సాధించింది.
రోహిత్ శర్మ (212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో అలరించాడు. లెఫ్టాండర్లు రవీంద్ర జడేజా (170 బంతుల్లో 66 బ్యాటింగ్; 9 ఫోర్లు), అక్షర్ పటేల్ (102 బంతుల్లో 52 బ్యాటింగ్; 8 ఫోర్లు) భారత్ ను భారీ ఆధిక్యం దిశగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జడేజా, అక్షర్ పటేల్ లు అజేయమైన 8వ వికెట్ భాగస్వామ్యంలో 81 పరుగులు జోడించారు. రీఎంట్రీతో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ రికార్డును బద్దలు కొట్టిన జడేజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, హాఫ్ సెంచరీని గతంలో కపిల్ నాలుగుసార్లు సాధించగా ప్రస్తుతం ఐదోసారి ఈ ఫీట్ సాధించిన జడ్డూ.. నూతన రికార్డుతో కపిల్ ను అధిగమించి సెహభాష్ అనిపించుకుంటున్నాడు. ఆస్ట్రేలియా అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ (5/82) అయిదు వికెట్లు సాధించాడు. మూడో రోజు జడేజా, అక్షర్ ఎంత సేపు బ్యాటింగ్ చేస్తారు.. జట్టుకు ఎంత ఆధిక్యం లభిస్తుంది.. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాటర్లను ఎంత త్వరగా ఆలౌట్ చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది.
మిడిల్ ఢమాల్
ఓవర్నైట్ స్కోరు 77/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియాను రోహిత్ (ఓవర్నైట్ స్కోరు 56), అశ్విన్ (23; ఓవర్నైట్ స్కోరు 0) ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ కొనసాగించారు. అశ్విన్ అద్భుతమైన షాట్లు ఆడాడు. కానీ స్వల్ప వ్యవధిలో అశ్విన్తో పాటు పుజారా (7)ను ఔట్ చేసిన మర్ఫీ ఆసీస్ బౌలర్ల కాన్ఫిడెన్స్ పెంచాడు. అశ్విన్ వికెట్ల ముందు దొరికిపోగా.. లెగ్సైడ్ బంతిని స్వీప్ చేసిన పుజారా షార్ట్ఫైన్ లెగ్లో ఫీల్డర్కు చిక్కాడు. దీంతో భారత్ 151/3తో లంచ్కు వెళ్లింది.
లంచ్ తర్వాత కోహ్లి (12)ని మర్ఫీ ఔట్ చేయగా.. సూర్యకుమార్ (8)ను లైయన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ 168/5తో కష్టాల్లో పడింది. జడేజా జతగా రోహిత్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. కమిన్స్ బౌలింగ్లో స్క్వేర్లెగ్ బౌండరీతో 90ల్లోకి చేరుకున్న అతను.. మర్ఫీ ఓవర్లో లాఫ్టెడ్ షాట్తో ఫోర్ కొట్టి 171 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. అనంతరం రోహిత్ ను ఆసీస్ కెప్టెన్ కమిన్స్ కొత్త బంతితో బౌల్డ్ చేశాడు. భారత కొత్త కీపర్ కేఎస్ భరత్ (8) కూడా తొందరగా పెవిలియన్ చేరినా.. అక్షర్ పటేల్.. జడేజాకు తోడుగా నిలిచాడు.
రీఎంట్రీలో జడేజా బ్యాట్తోనూ సత్తాచాటాడు. బంతితో 5 వికెట్లు తీసుకున్న జడేజా బ్యాటింగ్లోనూ కీరోల్ ప్లే చేశాడు. రోహిత్తో ఆరో వికెట్కు 61 పరుగులు జత చేసిన అతను.. అక్షర్తో అబేధ్యమైన ఎనిమిదో వికెట్కు 81 పరుగులు జోడించాడు. ఆసీస్ బౌలింగ్ ను ఆటాడుకున్న వీరి జోడీ జట్టు ఆధిక్యాన్ని వంద దాటించింది. ఆసీస్ బౌలర్లను అసహనానికి గురి చేస్తూ మరో వికెట్ కోల్పోకుండా భారత్ రెండో రోజు ఆటను ముగించింది.
ఆస్ట్రేలియాపై తొలిటెస్టు సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించిన భారత తొలి కెప్టెన్ గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు సారథిగానూ రోహిత్ కు ఇదే తొలి సెంచరీ.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) కమిన్స్ 120; కేఎల్ రాహుల్ (సి) అండ్ (బి) మర్ఫీ 20; అశ్విన్ ఎల్బీ (బి) మర్ఫీ 23; పుజారా (సి) బోలాండ్ (బి) మర్ఫీ 7; కోహ్లి (సి) కేరీ (బి) మర్ఫీ 12; సూర్యకుమార్ (బి) లైయన్ 8; జడేజా బ్యాటింగ్ 66; భరత్ ఎల్బీ (బి) మర్ఫీ 8; అక్షర్ బ్యాటింగ్ 52;
ఎక్స్ట్రాలు 5: మొత్తం: 114 ఓవర్లలో 7 వికెట్లకు 321;
వికెట్ల పతనం: 1-76, 2-118, 3-135, 4-151, 5-168, 6-229, 7-240; బౌలింగ్: కమిన్స్ 18-2-74-1; బోలాండ్ 17-4-34-0; లైయన్ 37-10-98-1; మర్ఫీ 36-9-82-5; లబుషేన్ 5-0-24-0; రెన్షా 1-0-7-0