* రాష్ర్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
* కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం
* తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా
విధాత, హైదరాబాద్: ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ట్రస్టుకు అత్యంత విలువైన ప్రాంతంలో రూ.300 కోట్ల విలువ చేసే 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎందుకు ఉచితంగా ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, ఐఏఎంసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ‘రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్లోని సర్వే నంబర్ 83/1 ప్లాట్ నంబర్ 27లోని 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ 2021, నవంబర్ 26న జీవో నంబర్ 126ను విడుదల చేసింది.
నిర్వహణ ఖర్చుల కింద అదనంగా రూ.3 కోట్లను మంజూరు చేస్తూ మరో జీవోను విడుదల చేసింది. ఓ ప్రైవేట్ అర్బిట్రేషన్ సెంటర్కు అంత విలువ చేసే భూమిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఇది తెలంగాణ అర్బన్ ఏరియాస్(డెవలప్మెంట్) చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. సహజ న్యాయ సూత్రాలకు ప్రభుత్వ నిర్ణయం విరుద్ధం. ఈ జీవోలను కొట్టివేసి, ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునేలా, రూ.3 కోట్లలో ఇక ముందు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఆపడంతో పాటు ఇప్పటివరకు ఇచ్చిన మొత్తాన్ని తిరిగి వెనుక్కు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి. ఐఏఎంసీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి’అని పేర్కొంటూ న్యాయవాది కె.రఘునాథ్ రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే…
ఈ పిల్పై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఓ ప్రైవేట్ సంస్థకు రూ.300 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. ఈ సంస్థతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకున్నా.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి భూమిని కేటాయించారన్నారు. ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా భూమిని ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ వాదనలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.