విధాత, వరంగల్: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 10 నుంచి 12 వ తేదీ వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు మాప్ అప్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఏంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది.
కన్వీనర్ కోటలో మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆఫ్షన్లును నమోదు చేసుకోవాలి. అర్హత, నిబంధనలు ఇతర సమాచారానికి http://www.knruhs.telangana.gov.in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.