విధాత: హైదరాబాద్లో పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తున్నది. తెల్లవారుజామునే బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపడుతున్నది. మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయన కుమారుడు, అల్లుడి ఇళ్లు, సంస్థల్లో ఐటీ తనిఖీలు చేస్తున్నది. కొంపల్లి పాం మెడోస్ విల్లాలో ఐటీ అదికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో దాదాపు 50 మంది బృందాలు పాల్గొన్నాయి.
తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలతో టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీపక్ష, పార్టీ కార్యవర్గ సంయుక్త సమావేశంలో ఐటీ, ఈడీ దాడులు జరగొచ్చు. అధైర్య పడొద్దు. తిరగబడండి అని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
నాటి నుంచి టీఆర్ఎస్ మంత్రులు, నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతుండటం గమనార్హం. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు పెంచింది. దీంతో రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధంతో పాటు ఐటీ, ఈడీ దాడులు జరుగుతుండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఇదిలాఉండగా ఐటీ అధికారులు మెడికల్ కాలేజీ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం నాలుగు మెడికల్ కాలేజీల బ్యాంకు లావాదేవీలను ఐటి అధికారులు పరిశీలిస్తున్నారు. కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేటు వ్యక్తులకు సీట్లను కోట్లకు అమ్ముకున్నట్లుగా ఆరోపణలున్నాయి.
మంత్రి నివాసం పక్కనే ఉన్న క్వార్టర్స్ లో సిబ్బంది జూట్ బ్యాగ్ లో పెట్టి దాచి ఉంచిన మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మంత్రి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు రూ.2 కోట్లు సీజ్ చేశారు.