విధాత: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీగా నోటిఫికేషన్ విడుదల అయింది. దీనికి లక్షలాది మంది యువత దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ, కర్నూల్, రాజమండ్రి, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో కోచింగ్ సెంటర్లు శిక్షణ ఇస్తున్నాయి. అయితే పేద విద్యార్థుల కోసం సీబీఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ వచ్చిన కొందరికి ఈ శిక్షణ ఇస్తానని ఆయన వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 6511పోలీస్ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతున్నఅభ్యర్థుల్నిదృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ యువతకు జేడీ ఫౌండేషన్ ద్వారా పోటీ పరీక్షల శిక్షణ నిమిత్తం హెచ్వైడీఎస్ ఐఏసీఈ ఇన్సిట్యూట్ సహకారంతో 1000 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇప్పించనున్నట్టు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ GTPL ప్రైమ్ న్యూస్ ద్వారా అభ్యర్థులకు తెలిపారు. ఉచితంగా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో శిక్షణ అందించనున్నట్టు పేర్కొన్నారు.
జేడీ ఫౌండేషన్, ఐఏసీఈ సంయుక్తంగా ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు హాజరయ్యే యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఆర్ధిక పరిస్థితి బాలేని 1000మంది అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేందుకు ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా 35 సెంటర్లలో ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నామన్నారు. అలా ఒక్క ఉత్తరాంధ్రలోనే 21 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామన్నారు. దరఖాస్తు చేసుకున్న 42వేల మంది అభ్యర్థుల్లో ప్రతిభ కనబర్చే 1000మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
విశాఖలో గత 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన జెడి మళ్లీ విశాఖ నుంచి బరిలో దిగుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంద్ర విద్యార్థులకు ఎక్కువగా మేలు జరిగేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం ముదావహం.