విధాత, వరంగల్: నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్థి హన్మకొండ పర్యటన నేపథ్యంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. IDOC మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు KUDA చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపీ, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తో కలిసి నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహిత కైలాష్ సత్యర్థి మూడు రోజుల హన్మకొండ పర్యటనపై సమీక్ష సమావేశంలో చర్చించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఈ నెల 18,19,20 తేదీల పర్యటనలో భాగంగా ఈ నెల 18 న అదాలత్ కోర్ట్ సందర్శన, 19 న హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళశాల మైదానంలో భారీ బహిరంగ సభ, ఈ కార్యక్రమానికి 50 వేల మంది పాఠశాల విద్యార్థులు హాజరు అవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమాలకు అనుగుణంగా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో వేదిక, బారీకేడ్లు, వెళ్ళే దారిని బాగు చేయించాలని అధికారులను ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లను చూడాలని పోలీస్ శాఖకి సూచించారు. మైదానమంతా శుభ్రంగా ఉండేలా చూడాలని, వాటరింగ్ చేయాలని అధికారులకు తెలిపారు.
ఆ రోజున విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసి, వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.