విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఈ నెల 18న సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన అనంతరం 19 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు ప్రారంభించనున్నారు.
మొదటి విడత కంటి వెలుగు బాధితులకు చైనా నుండి అద్దాలు తెప్పిస్తే ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మెడికల్ డివైస్ పార్కులో తయారవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదున్నర లక్షలు అద్దాలు ఇచ్చే విధంగా మెడికల్ అధికారులు, ప్రభుత్వం ముందు చూపుతో కంటి అద్దాలు తయారు చేయిస్తున్నారు.
ఐదున్నర లక్షలకు గాను రెండున్నర లక్షలు సంగారెడ్డి లోనే తయారవుతున్నాయి. మిగతావి ఇతర దేశాల నుండి రానున్నాయి. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం లో బాధితులకు చైనా నుండి అద్దాలు రాష్ట్ర ప్రభుత్వం తెప్పించింది.
ఇప్పుడు ఏకంగా సంగారెడ్డి మెడికల్ డివైస్ పార్క్ కేంద్రంగా అద్దాలు.. (అన్నిరకాలు) రీడింగ్ అద్దాలు మొదలుకొని దూరం, దగ్గర చూపు సైట్ లకు సంబంధించి అద్దాలు ఇక్కడే తయారవుతున్నాయి.రాష్ట్ర వ్యాపితంగా 5.55 లక్షల కంటి అద్దాలు అవసరమవుతాయని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది.
ఒకే సారి 5.5 లక్షల అద్దాలు తాయారు చేయించడం సంగారెడ్డిలో సాధ్యం కాకపోవడంతో రెండున్నర లక్షలు సంగారెడ్డిలో మరో రెండున్నర లక్షలు బర్మా ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో మెదక్ ఉమ్మడి జిల్లా సంగారెడ్డి కేంద్రంగా అద్దాలు తయారవుతున్నాయి. ఇప్పటికే అద్దాల కిట్లు అన్ని జిల్లాల కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.
మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం..ఇలా
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో 19 నుండి కంటి వెలుగు శిబిరాలు నిర్వహించనున్నారు. మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు అయా జిల్లాల కలెక్టర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19న జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమై జూన్ 15వ తేదీన ముగియనుంది. 100 రోజులు ఈ కార్యక్రమం నడవనుంది.
మెదక్ జిల్లాలో 8,85,519 జనాభా ఉండగా జనాభాలో 55 శాతం మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మెదక్ జిల్లాలో కంటి పరీక్షల నిమిత్తం 40 బృందాలు ఎర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో35, పట్టణాల్లో 5 బృందాలు ఎర్పాటు చేశారు. జిల్లాలో 496గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల లో 544 శిబిరాలను ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో 69 వైద్య బృందాలను ఏర్పాటు చేయగా 854 క్యాంపులను నిర్వహించ నున్నారు. సిద్దిపేట జిల్లాలో సైతం కలెక్టర్ అధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.