బెంగళూరు : ఇది అమానుష ఘటన. ఓ యువకుడు తన ప్రియురాలిని తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అతని తల్లి పట్ల అమ్మాయి తరపు బంధువులు క్రూరంగా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా, ఆమెను వివస్త్రను చేసి స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత ఆమెను చితకబాది హింసించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బెళగావికి చెందిన ఓ యువకుడు.. స్థానికంగా ఉండే ఓ యువతిని గత కొన్నేండ్ల ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువతిని బయటకు తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆదివారం రాత్రి నేరుగా అబ్బాయి ఇంటికి వెళ్లి, అతని తల్లిని బయటకు ఈడ్చుకొచ్చారు.
ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి, తీవ్రంగా చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, బాధితురాలిని చేరదీశారు. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సీఎం సిద్ధరామయ్య
ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. మహిళను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక్క బెళగావిలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగిన సహించమని తేల్చిచెప్పారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.
ఏడుగురిని అరెస్టు చేశాం: కర్ణాటక హోంమంత్రి
మహిళను వేధించిన కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా కోర్టులో హాజరు పరుస్తామన్నారు. బాధితురాలిని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.