విధాత: బెంగళూలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం యునెస్కో గుర్తింపు సాధించింది. ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. 2023 ప్రిక్స్ వెర్సైల్లెస్ అవార్డుకు టెర్మినల్ 2 (T2) ఎంపికైంది. ఇంటీరియల్ విభాగంలో కూడా ప్రత్యేక బహుమతి సాధించినట్టు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ గురువారం వెల్లడించింది.
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ ఎలీ సాబ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రపంచ న్యాయమూర్తుల ప్యానెల్ ఈ గుర్తింపును ఇచ్చింది. ఈ గుర్తింపును పొందిన ఏకైక భారతీయ విమానాశ్రయంగా బెంగళూరు విమానాశ్రయం నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి విమానాశ్రయాల జాబితాలో కెంపెగౌడ్ ఎయిర్పోర్టు చోటు సంపాదించింది.
ఈ అరుదైన గుర్తింపు పట్ల బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో హరి మరార్ హర్షం ప్రకటించారు. “2023 ప్రిక్స్ వెర్సైల్లెస్ అవార్డుకు టెర్మినల్ 2 నామినేట్ కావడం చాలా గర్వకారణం. టెర్మినల్ గుర్తింపు పొందడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ అవార్డు విమానాశ్రయం అర్హమైనది“. అని పేర్కొన్నారు. అంతకుముందే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 ఐజీబీసీ గ్రీన్ న్యూ బిల్డింగ్ రేటింగ్ సిస్టమ్ కింద ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్రతిష్టాత్మకమైన ఐజీబీసీ ప్లాటినం గుర్తింపు పొందిందని తెలిపారు.