ఖమ్మం BRS సభకు కుమారస్వామి రాలేదేం?

విధాత: బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో సన్నిహితంగా తిరిగిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ ఎస్‌ నాయకుడు హెచ్‌ డీ కుమారస్వామి ఖమ్మం బీఆర్ఎస్ ప్రారంభ సభకు హాజరు కాకపోవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ కూడా రాకపోవడం గమనార్హం. వీరిద్దరినీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆహ్వానించారని, బిజీ షెడ్యూలు కారణంగా వారు హాజరు కాలేదని […]

  • Publish Date - January 18, 2023 / 01:30 PM IST

విధాత: బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో సన్నిహితంగా తిరిగిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ ఎస్‌ నాయకుడు హెచ్‌ డీ కుమారస్వామి ఖమ్మం బీఆర్ఎస్ ప్రారంభ సభకు హాజరు కాకపోవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ కూడా రాకపోవడం గమనార్హం.

వీరిద్దరినీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆహ్వానించారని, బిజీ షెడ్యూలు కారణంగా వారు హాజరు కాలేదని అంటున్నారు. నేతల వివరణలు ఎలా ఉన్నా.. గత ఏడాది కాలంగా అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్న కుమార స్వామి ఎందుకు రాలేదనే చర్చ ఖమ్మం సభకు హాజరైన కొందరు ముఖ్య నాయకుల మధ్య జరిగిందని సమాచారం.

రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే రెండు పార్టీల నాయకులు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కూడా కుమారస్వామి పాల్గొన్న విషయం తెలిసిందే.

బీజేపీకి వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పినప్పటికీ, అంతర్గతంగా వేరే వ్యవహారం ఉండడంతో తేజస్వీ దూరంగా ఉంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. కేసీఆర్‌ స్వయంగా వెళ్లి కలిసి వచ్చిన శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే కూడా ఈ సభకు రాలేదు. వారికి ఆహ్వానాలు వెళ్లాయా? లేదా అన్న విషయం తెలియరాలేదు. కేసీఆర్‌ విషయంలో కుమార స్వామి పునరాలోచనలో పడ్డారా అనేది మున్ముందు వెల్లడి కానున్నది.