విధాత: లోక్సభ ఎన్నికలకు సమాయాత్తం కావాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీలు, లోక్ సభ నియోజకవర్గాల ఇంఛార్జిలతో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ తో కలిసి కిషన్రెడ్డి హాజరయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లే అంశాలపైన, వికసిత భారత్, విశ్వకర్మ పథకాలపైన సమావేశంలో చర్చించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని తెలిపారు.
మరికొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆరెస్, కాంగ్రెస్లపై సమాన పోరాటాలుంటాయన్నారు. తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ అధికారం వచ్చేందుకు అన్ని అవకాశాలున్నాయన్నారు. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 8మంది ఎమ్మెల్యేలు అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్నారు. తెలంగాణలో వికసిత భారత్ ప్రచారాన్ని ప్రారంభించాలని సూచించారు.
కేంద్రంలో మూడోసారి కూడా నరేంద్రమోడీనే ప్రధాని అవుతారన్నారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీతో పొత్తు విఫలమవ్వడం, జనసేన పోటీ చేసిన 8 చోట్ల డిపాజిట్లు కోల్పోవడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.