విధాత: మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్కు చెందిన బీజేపీ సీనియర్ నేత జగన్నాథంతో మంత్రి కేటీఆర్ జరిపిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో మంత్రి బేరసారాల ముచ్చట మాట్లాడుకున్నా రాజగోపాల్ రెడ్డి తన స్వప్రయోజనాల కోసం పార్టీ మారారు. ఈ ఒక్క సీటుతో బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయేది లేదంటూ ఫోన్లో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజగోపాల్ రెడ్డి నిజమైన బీజేపీ నేత కాదని, ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం చేశారో మీకూ తెలుసు ఈ ఎన్నికలో మాకు సహకరించాలంటూ జగన్నాథంతో కేటీఆర్ మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పోటీ టీఆరెఎస్ బీజేపీల మధ్యనే ఉంటుంది అనే ప్రచారం జరుగుతున్నది.
ఈ సమయంలో అక్కడ చేనేత వర్గానికి చెందిన ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే గట్టుప్పల్, సంస్థాన్ నారాణపురం మండలాల్లో ఉండే చేనేత కుటుంబాల ఓట్ల కోసం ఆ వర్గంలో పేరు ఉన్న బీజేపీ సీనియర్ నేతను కేటీఆర్ మద్దతు అడగటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోటీ ఉండబోతున్నది, ఇరు పార్టీల మధ్య ఓట్ల శాతం నెక్ టూ నెక్ ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఉప బాధ్యత మోస్తున్న కేటీఆర్ పార్టీ గెలుపు కోసం బీజేపీ స్థానిక నేతను అభ్యర్థించడాన్ని ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది.
విపక్ష నేతతో కలిసి పనిచేద్దామని అని కోరిన కేటీఆర్ వాళ్ళ పార్టీకే చెందిన మాజీ ఎంపీతో మాట్లాడి ఉంటే ఆయన పార్టీ వీడే వారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఉన్న వారిని పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీల నేతలను అభ్యర్థించే దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని అంటున్నారు.
ఇదిలాఉండగా టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఆ ఆడియో ఫేక్ అని ఇది బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఓ కళాకండమే అంటూ బీజేపీని ఏకి పారేస్తున్నారు.