Margadarshi Chits
విధాత: మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో జగన్ ప్రభుత్వం మరింత ముందుకు వెళుతోంది. ఇప్పటికే చిట్ ఫండ్స్ డబ్బులను హెడ్ ఆఫీసుకు తరలించి వేర్వేరు ఇతర వ్యాపారాల్లోకి మళ్లించారు అనే అంశం మీద సీరియస్గా ఉన్న జగన్ ప్రభుత్వం అది చిట్ ఫండ్ వ్యాపార నిబంధనలకు విరుద్ధం అంటూ ఇప్పటికే రూ.1035 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ ద్వారా ఏటాచ్ చేసింది.
ఏ -1 గా రామోజీరావు, ఏ -2 గా మార్గదర్శి ఎండి శైలజ మీద కేసు బుక్ చేసిన సీఐడీ ఇప్పటికీ వారిని పలుమార్లు విచారించింది. ఇప్పుడు మరోమారు, అంటే జూలై ఐదున మళ్ళీ విచారణకు రావాలని నోటీసులు పంపింది.
గతంలో తాము వారిని విచారించగా వారు ఇద్దరూ సరిగా సహకరించకుండా డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నారు అంటూ ఆరోపిస్తున్న సీఐడీ ఇప్పుడు మరోమారు వారిని విచారించనుంది.
రామోజీ, శైలజతోబాటు పాటు ఏ3 నిందితుడు శివరామకృష్ణలు జూలై 5న విచారణ నిమిత్తం గుంటూరు సీఐడీ రీజనల్ కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
మొన్ననే ఈ మార్గదర్శి చిట్స్ మీద ప్రెస్ మీట్ పెట్టిన సీఐడీ అదనపు డిజి సంజయ్ మాట్లాడుతూ మొత్తం నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం చేస్తున్నారని, నిధులు వేరే వ్యాపారాలకు మళ్లిస్తున్నారు అని, అనుమతులు లేకున్నా డిపాజిట్లు తీసుకుంటున్నారని వివరిస్తూ కొన్నిచిట్ గ్రూపులను మూసేస్తున్నామని, ప్రజల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది అని చెప్పారు. ఇక ఇప్పుడు ఐదున విచారణకు రామోజీ వస్తారా ? కోర్టు ద్వారా ఉపశమనం పొందుతారా చూడాలి.