విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఫహిం పాషా రూ. 15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం.. నర్సాపూర్ కు చెందిన సతీష్ ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటుకు పర్మిషన్ కోసం ఆన్ లైన్ లో వైద్య ఆరోగ్యశాఖ కు దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు కావాల్సిన డీడీ తోపాటు సంబంధిత పత్రాలను కార్యాలయంలో సమర్పించాడు. ఫైల్ ప్రాసెస్ చేసేందుకు కమ్యూనిటీ హెల్త్ ఆపీసర్ ఫహీం పాషా రూ.15 వేలు డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని తెలపడంతో సతీష్ ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో గురువారం ఫహీం పాషా మెదక్ పట్టణంలోని డిపో బస్టాండ్ దగ్గర సతీష్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఫహిం పాషాను అదుపులోకి తీసుకుని కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ ఆఫీస్కు తీసుకెళ్లి రాత్రి వరకు విచారణ జరిపారు. ఫిజియో థెరఫీ క్లినిక్ కు పర్మిషన్ ఇచ్చేందు కోసం ఫహీం పాషా లంచం డిమాండ్ చేసిన విషయంలో డీఎం హెచ్ ఓ ఆఫీస్ లో ఇంకెవరిదైనా పాత్ర ఉందా అనేదానిపై విచారణ జరుపుతామని డీ ఎస్ పీ చెప్పారు. ఇదిలా ఉండగా జిల్లా అధికారి పాత్ర…కార్యాలయంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వారి వివరాలు … ఈ సంఘటనలో డబ్బులు తీసుకొని ఇంకెవరి కై నా ఇస్తున్నారా అని ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.