Medak | ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు: పద్మాదేవేందర్ రెడ్డి

Medak మహిళా సంక్షేమ దినోత్సవంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విధాత, మెదక్ బ్యూరో: గర్భస్థ శిశువు నుండి చనిపోయే వరకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ చదువుతో పాటు, ఆర్ధిక పరిపుష్టి సాధిందాలని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక సాయి బాలాజీ గార్డెన్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణా మహిళా సంక్షేమ దినోత్సవ […]

  • Publish Date - June 13, 2023 / 01:03 PM IST

Medak

  • మహిళా సంక్షేమ దినోత్సవంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: గర్భస్థ శిశువు నుండి చనిపోయే వరకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ చదువుతో పాటు, ఆర్ధిక పరిపుష్టి సాధిందాలని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక సాయి బాలాజీ గార్డెన్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణా మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రామాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.

అంతకుముందు అతిధులను బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించగా, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ మెదక్ నియోజక వర్గ ప్రగతి నివేదిక చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు గుక్కెడు మంచినీళ్ల కోసం మహిళలు బిందెలు పట్టుకొని కిలో మీటర్ల దూరం వెళ్లేవారని, కానీ నేడు ఇంటింటికీ కుళాయి నీలందిస్తూ మహిళల ఆత్మ గౌరవాన్ని ముఖ్యమంత్రి నిలబెట్టారన్నారు. ఒంటరి మహిళా, వితంతువులు, బీడీకార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తుండడంతో పాటు భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్నిఅందించుటకు బుధవారం నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లు అందించనున్నామని అన్నారు.

అదేవిధంగా బాలింతలు, పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గ్రుడ్లు,బాలామృతం అందిస్తున్నామని, ప్రభుత్వాసుపత్రులలో కాన్పులు చేసుకున్న వారికీ నగదు తో పాటు కేసీఆర్ కిట్ అందిస్తున్నామని అన్నారు.గురుకుల పాఠశాలల ద్వారా అందిస్తున్న విద్యతో బాలికలు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని అన్నారు. పేదింటి ఆడపిల్లకు మేనమామలా పెళ్ళికి 1,00,116 ఇస్తూ సామాజిక భద్రత కల్పిస్తుండడం ద్వారా బాల్య వివాహాలు నివారించగలిగామన్నారు.

పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని , మహిళల పేర రెండు పడకల ఇల్లు, ఇళ్ల పట్టాలు అందిస్తుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను టీచర్లుగా గుర్తిస్తూ గౌరవ వేతనం పెంచిందని , అంగన్వాడీ హెల్పర్లకు కూడా రెమ్యునరేషన్ పెంచిందని అన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్న పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశ వర్కర్ల పట్ల ముఖ్యమంత్రికి సానుభూతి ఉన్నదని, తప్పక వారికీ న్యాయం చేస్తారన్నారు.

ఆడపిల్లకు రక్షణ కవచంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించుటకు వి-హబ్ ఏర్పాటు చేశారన్నారు. గతంలో కంటే ఇప్పుడు స్వయం సహాయ మహిళా సంఘాలకు 5 రేట్లు అధికంగా బ్యాంకు లింక్ రుణాలు అందిస్తూ వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఊతం ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అనే అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో మహిళలు కూడా చురుకుగా పాల్గొని బతుకమ్మ, బోనాలు, రోడ్డుపై వంటా వార్పు ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తూ, ధర్నాలతో పాలొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సంసారం సాఫీగా నడవాలంటే భార్య,భర్తలు బండికి రెండు చక్రాల లాంటివారని, ఇరువురు పరస్పర సహకారంతో పయనించాలని అన్నారు.

అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడూతూ సమాజంలో మహిళలకు ప్రభుత్వం విస్తృత అవకాశాలు కల్పించడం ద్వారా జిల్లాలో మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు అధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు. మహిళలలో వృత్తి నైపుణ్యతను పెంచి ఆర్థికంగా బలోపేతం కావడానికి సెర్ఫ్, తదితర శాఖల ద్వారా పలు కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు.

అట్టి పథ‌కాలను సద్వినియోగం చేసుకుంటూ తోటి వారిని కూడా ప్రోత్సహించి వారి ఎదుగుదలకు సహకరించాలని సూచించారు మహిళలు దృఢ మనస్తత్వం కలవారని, ఆలోచన శక్తి అమోఘమని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ధైర్యంతో ముందుకుసాగితే అన్నింటా విజయాలు సాధిస్తారని అన్నారు
అంతకుముందు లంబాడాలతో ఎమ్మెల్యే చిందులు వేశారు. విద్యార్థినులు చక్కటి సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. వివిధ శాఖలలో ఉత్తమ మహిళా ఉద్యో గులను జ్ఞాపిక ప్రశంసా పత్రంతో అతిధులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ వైస్ చైర్ పర్సన్ లావణ్యా రెడ్డి, ఎంపీపీ యమున జమునా రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, డీఎస్ డిఓ విజయలక్ష్మి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిర, మత్స్య శాఖ ఎడి రజిని, డిసిఓ కరుణ, అదనపు పిడి భీమయ్య, మైనారిటీ అధికారి జెంలా నాయక్, బి.సి. అభివృద్ధి అధికారి శంకర్, రామాయమపేట మునిసిపల్ కమీషనర్ ఉమాదేవి, మహిళా కౌన్సిలర్లు, కౌన్సిలర్లు, సి.డి.పి .ఓ.లు, సూపర్ వైజర్లు, అంగన్వాడి కార్యకర్తలు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.