విధాత: యాదాద్రి భువనగిరి జిల్లాలో గత కొద్ది రోజులుగా కల్తీ పాల దందా వెలుగులోకి రావడంతో యాదాద్రి జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి.స్వాతి ఇతర సిబ్బందితో కలిసి పోలీసు వారి సాయంతో బుధవారం తెల్లవారుజామున బీబీనగర్ టోల్ ప్లాజా దగ్గర నిఘా ఉంచి అనుమానాస్పద పాల వాహనాలను ఆపి మొబైల్ టెస్టింగ్ ఫుడ్ లాబరేటరీలో అప్పటికప్పుడు పాలను పరీక్షించి పాల కల్తీకి పాల్పడిన వారి మీద కేసులు నమోదు చేశారు.
కొండమడుగు గ్రామంలోని కడెం కుమార్ యాదవ్ అనే ఒక పాల వ్యాపారి తన పాల కేంద్రంలో హానికరమైన కెమికల్స్ ఫార్మల్డిహైడ్, సుక్రోస్, అమ్మోనియం సల్ఫేట్ లాంటి వాటిని కలిపి కల్తీకి పాల్పడుతుండడంతో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కల్తీ పాలు, హానికరమైన కెమికల్స్ అన్నిటిని స్వాధీనం చేసుకొని అతని మీద కేసు నమోదు చేశారు.
అలాగే బీబీనగర్లో మరో ఇద్దరిపై కూడా కల్తీ పాల కేసు నమోదు చేసి, వారికి లైసెన్సులు లేకుండా అక్రమంగా పాల వ్యాపారం జరుపుతున్నందున వారిని హెచ్చరించి నోటీసులు ఇచ్చారు. పోలీసు వారి సహాయంతో వారి మీద కూడా కేసులు నమోదు చేసినట్లుగా ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి తెలిపారు.
ఈఫార్మల్ డిహైడ్ లాంటి కెమికల్స్ని శవాలు భద్రపరచడానికి కూడా ఉపయోగిస్తారని. ఎన్ని రోజులైనా పాడవకుండా, పాలు విరగకుండా ఉండడానికి వాటిని కలుపుతున్నారని, ఇలాంటి కల్తీ పాలు నిరంతరం తాగుతుండడం వల్ల కాలేయ సమస్యలు, అజీర్తి, జీర్ణకోశ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, రావడానికి అవకాశం ఉంటుందన్నారు.
పాల స్వచ్ఛత విషయంలో రాజీ పడబోమని.. అలా చేయడం వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తాగే ఈ పాలను కల్తీ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
అలాగే అట్లాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు అవసరమైతే క్రిమినల్ కేసులు, పోలీసు తదితర శాఖల సహకారంతో పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అలాగే ప్రజలు ఈ కల్తీ పాలు, కల్తీ ఆహార పదార్థాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎవరికైనా కల్తీకి పాల్పడుతున్నట్లు అనుమానం వచ్చినా, సమాచారం తెలిసినా సంబంధిత జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.
తనిఖీల్లో భువనగిరి, మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, బీబీనగర్ సబ్ ఇన్స్పెక్టర్ సైదులు, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ లాబోరేటరీ ల్యాబ్ టెక్నీషియన్ రతన్ రావు, విజయ్, మల్లికార్జున్ , హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, వీఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది, హెల్త్ సిబ్బంది శివ, శ్రీకాంత్ పాల్గొన్నారు.