విధాత: రూ. 4వేల కోట్ల విలువైన మియాపూర్ భూములను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్కు అప్పగించారని బీజేపీ ఎమ్మెల్ల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ భూ కుంభకోణం అంతా మాజీ సీఎస్ సోమేష్కుమార్ కనుసన్నల్లోనే జరిగిందన్నారు. ఖమ్మంలో నిర్వహించే సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రాక్షసులైన ఆంధ్రోళ్లు ఇప్పుడు రక్త సంబంధీకులు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలని రఘునందన్రావు నిలదీశారు. తోట చంద్రశేఖర్కు 40 ఎకరాల మియాపూర్ భూములు అప్పగించడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్ర కూడా ఉందన్నారు.
సుఖేష్ గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోట చంద్రశేఖర్ విషయంలో ఎందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించారు. సర్వే నెంబర్ 78లో జరుగుతున్న అవకతవకలను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వెళతామన్నారు.
ఎనిమిది ఎకరాలకు ఒక న్యాయం నలభై ఎకరాలకు మరొక న్యాయమా? అని ప్రశ్నించారు. మియాపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. సర్వే 78లో 40ఎకరాల భూములను తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించడాన్ని ప్రశ్నించారు.
బీహార్ నుంచి వచ్చిన అధికారులంటే కేసీఆర్ కు ప్రేమ ఎక్కువన్నారు. అందులో భాగంగానే బీహార్ కు చెందిన అధికారిని డీజీపీగా నియమించారు. గతంలో దొంగలుగా కన్పించిన ఆంధ్ర వాళ్ళు.. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులుగా మారిపోయారన్నారు.
అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకునేందుకే.. డైరెక్ట్ గా రిక్రూట్ అయినవారిని కాకుండా.. కన్ఫర్డ్ ఐఏఎస్ లను కలెక్టర్లుగా నియమిస్తున్నారని రఘునందన్రావు ఆరోపించారు.