Site icon vidhaatha

MLC Deshapathi | 100 సీట్లతో హ్యాట్రిక్ సర్కార్: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

MLC Deshapathi |

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ‘తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 2014లో 63 సీట్లు, 2018లో 85 సీట్లు సాధించాం. రానున్న శాసనసభ ఎన్నికల్లో 100 సీట్లతో హ్యాట్రిక్ సర్కార్ ఏర్పాటు చేయబోతున్నాం’ అంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అధ్యక్షతన, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నదని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలో సకలజనుల సమ్మె, సింగరేణి సమ్మె వంటి అనేక పోరాటాలతో తెలంగాణ సమాజాన్ని ఏకోన్ముముఖం చేసి గమ్యాన్ని ముద్దాడే వరకు సంకల్పంతో కొట్లాడి తెలంగాణ సాధించుకున్నమని తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో 100 సీట్లతో హ్యాట్రిక్ సర్కార్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

కేసీఆర్ అపర భగీరథుడని, కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని కాళేశ్వరం ప్రాజెక్ట్, వలసల జిల్లాకు కృష్ణమ్మ నీళ్లు పారించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ యువకులు, గ్రామ మహిళ కమిటీలు మరింత ఉత్సాహంగా పనిచేసేలా ప్రోత్సహించాలని, త్వరలోనే ఈ రెండు కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీబీకేఎస్ నాయకుడు కేంగర్ల మల్లయ్య, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Exit mobile version