మెరికల్లాంటి యువ నేతలను సృష్టిస్తాం,తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా? పార్టీ కార్యకర్తలకు అధినేత కేసీఆర్‌ భరోసా

సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆరెస్‌ పార్టీ శ్రేణులకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదని, పార్టీ నుంచి పోయి దొంగల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.

  • Publish Date - June 28, 2024 / 06:02 PM IST

పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప
నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు
ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుంటం
దొంగల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు..

హైదరాబాద్‌: సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆరెస్‌ పార్టీ శ్రేణులకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదని, పార్టీ నుంచి పోయి దొంగల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఒకరు పోతే పదిమంది నాయకులను పార్టీయే తీర్చిదిద్దుకుంటుందని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి వున్నయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను,కలలను నెరవేర్చగలిగే అవగాహన బీఆరెస్‌కు మాత్రమే ఉన్నదని అన్నారు. శుక్రవారం కోరుట్ల జగిత్యాల నియోజక వర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతలనుద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు. రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజలకోసం పనిచేయాల్సి ఉందని చెప్పారు. గత పదేండ్లు ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా లక్ష్యం ప్రకారం పనిచేసి ప్రగతిని సాధించి ప్రజల మన్ననలను పొందామని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తపడుతుంటారని, మొన్నటి ఎన్నికల్లో అదే జరిగిందని చెప్పారు. అంతమాత్రాన నిరుత్సాహపడొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. ఏ హోదాలో ఉన్నా.. ప్రజల కోసమే పనిచేయాలని చెప్పారు. అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి మాత్రమేనని, ఇంకా నెరవేరాల్సిన ప్రజల కలలను మనం మాత్రమే నెరవేరుస్తామని చెబుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే

ఆనాడు మనం ఉద్యమంలకు దిగినప్పుడు మనతో ఎవరున్నారు? నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీనే. మొన్న జగిత్యాల నుంచి ఒకాయన పోయి దొంగలల్ల కలిసిండు. బాధ పడేదేమీలేదు. ఆయనను తయారుచేసింది పార్టీనే. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారుచేసుకుంటది’ అని కేసీఆర్‌ వివరించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కే సంజయ్ కుమార్ ఒక పక్క డాక్టరుగా మరోపక్క ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కేసీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, జాజుల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేశ్‌, పెద్దపెల్లి టీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులతో గులాబీ దళపతి ప్రత్యేకంగా సమావేశమై.. పార్టీ బలోపేతం గురించి చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, జీవన్ రెడ్డి, గంప గోవర్ధన్, జాజల సురేందర్, హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు.

Latest News