జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు

తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది.

Reported by: Y.V. Narsimha Reddy | క్రీడలు | Jul 19, 2026, 1:10 pm IST
Read Time: 4 mins
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు

విధాత : తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో జపాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ యమగుచిని వరుస గేమ్ లలో ఆమె సొంతగడ్డపైనే ఓడించి విజయం సాధించిన సింధు టైటిల్ సాధించింది. యమగుచిపై ఆరంభం నుంచి తన అటాకింగ్ గేమ్ తో ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-17, 21-17 తేడాతో యుమగుచిని ఓడించింది.

50 నిమిషాల్లోనే సింధు మ్యాచ్ ను ముగించినప్పటికి…ప్రతి గేమ్ కూడా హోరాహోరీగా చివరి వరకు సాగడం విశేషం. జపాన్‌ ఓపెన్‌ సూపర్‌-750 టోర్నీలో తొలిసారి విజేతగా నిలవడమే కాదు.. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

యమగుచిపై సింధుకు ఘనమైన రికార్డేమీ లేదు. 2026లో ఈ మ్యాచ్‌ కాకుండా మరో మూడింట్లో ఇరువురూ తలపడ్డారు. అందులో రెండుసార్లు యుమగుచినే విజయం సాధించింది. మలేషియా ఓపెన్‌లో యమగుచి మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లడంతో సింధుకు విజయం వరించింది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో, అలాగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సింధుపై యమగుచి గెలిచింది.

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టైటిల్‌ తో సింధు రెండేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌లో మళ్లీ ఛాంపియన్‌గా నిలిచింది. గతంలో 2024 డిసెంబరులో సయ్యద్‌ మోదీ టోర్నీ గెలిచిన తర్వాత ఆమెకు ఇదే తొలి వరల్డ్‌ టూర్‌ టైటిల్‌. సూపర్‌-750 లేదా అంతకంటే ఉన్నత స్థాయి టోర్నీల్లో ఏడేళ్ల తర్వాత మళ్లీ విజేతగా నిలిచిన సింధు తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది.