పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !

దోపిడీలలో మా దోపిడీ వేరయా..అన్నట్లుగా దొంగలు పక్కా స్కెచ్ తో నార్వార్ కోటలోని 400ఏళ్ల నాటి చారిత్రాక ఫిరంగిని దోపిడీ చేసిన ఘటన వైరల్ గా మారింది. దొంగలు 3,500కిలోలు(3.5 టన్నుల) భారీ బరువున్న ఫిరంగిని తరలించడానికి ముందస్తు ప్రణాళికతో క్రేన్, ట్రక్కు వంటి భారీ వాహనాలతో వచ్చి దానిని దోచుకెళ్లిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jul 19, 2026, 11:58 am IST
Read Time: 5 mins
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !

విధాత, హైదరాబాద్ : దోపిడీలలో మా దోపిడీ వేరయా..అన్నట్లుగా దొంగలు పక్కా స్కెచ్ తో నార్వార్ కోటలోని 400ఏళ్ల నాటి  చారిత్రాక ఫిరంగిని దోపిడీ చేసిన ఘటన వైరల్ గా మారింది. దొంగలు 3,500కిలోలు(3.5 టన్నుల) భారీ బరువున్న ఫిరంగిని తరలించడానికి ముందస్తు ప్రణాళికతో క్రేన్, ట్రక్కు వంటి భారీ వాహనాలతో వచ్చి దానిని దోచుకెళ్లిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలోని సింధియా రాజవంశం కాలంనాటి చారిత్రాత్మక నార్వార్ కోట ప్రాంగణం నుండి చారిత్రక నార్వార్ కోట నుంచి 400 ఏళ్ల నాటి చారిత్రాత్మకభారీ ఫిరంగిని దుండగులు అపహరించారు.జూలై 15-16 అర్ధరాత్రి సమయంలో ఈ భారీ దోపిడీ జరిగింది. సుమారు 25 నుంచి 30 మంది సాయుధులు కోట వెనుక మార్గం ద్వారా లోపలికి ప్రవేశించారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు బాల్‌కిషన్‌ను తుపాకీతో బెదిరించి అడ్డుకుంటే చంపేస్తామని హెచ్చరించారు. అతని వద్ద కేవలం కర్ర మాత్రమే ఉండటం, కనీసం టార్చ్‌లైట్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకపోవడం..దుండగులు అత్యాధునిక ఆయుధాలతో రావడంతో బాలకిషన్ వారిని ఏమి చేయలేక నిస్సాహయంగా ఉండిపోయాడు.

దొంగలు 3,500కిలోలు(3.5 టన్నుల) భారీ బరువున్న 400ఏళ్ల నాటి ఫిరంగిని క్రేన్‌ సహాయంతో ట్రక్కులోకి ఎక్కించి తీసుకుని వారు అక్కడి నుంచి పరారయ్యారు. కోటలోని కచేరి ప్రాంగణంలో మొత్తం 14 ఫిరంగులు ఉండగా, వాటిలో అత్యంత విలువైన ఒక ఫిరంగిని దుండగులు ఎత్తుకెళ్లారు. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఫిరంగికి సింధియా కాలంలో సైనికపరంగా విశేష ప్రాముఖ్యత ఉండేది. దీనిపై ఉన్న అద్భుతమైన కళాకృతులు, గుర్తులు ఆ ఫిరంగికి ఉన్న చారిత్రక విలువను చాటిచెబుతాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కరేరా ఎస్‌డీపీఓ ప్రశాంత్ శర్మ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.దొంగలు పక్కా స్కెచ్..ముందస్తు రెక్కీతో ఫిరంగి దోపిడీ చేసినట్లుగా భావిస్తున్నారు.

పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ తరుణ్ కుమార్ మహోబియా ఫిరంగా దోపిడీని తీవ్రంగా పరిగణించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కోటను సందర్శించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ దోపిడీ వెనుక అంతర్జాతీయ పురావస్తు స్మగ్లింగ్ ముఠాల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.